ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారు రైతులకు కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే 13వ విడత నిధులు అర్హత గల రైతుల అకౌంట్లలో పడనున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 13వ విడత డబ్బులు ఈ నెలాఖరులో విడుదల కానున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని ఇంకా వెల్లడించలేదు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద.. చిన్న, సన్నకారు రైతులకు మూడు వాయిదాలలో ప్రతి సంవత్సరం రూ. 6,000 అందజేస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోకే జమ చేస్తున్న కేంద్రం ప్రభుత్వం ఇప్పటి వరకు 12 విడతలు ఇచ్చింది. అక్టోబర్ 17న చివరి విడత ఇవ్వగా.. ఇప్పుడు 13వ విడుత నిధులు విడుదల చేయనుంది సర్కార్.
12వ విడతలో 8 కోట్ల మంది రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పీఎం కిసాన్ కార్యక్రమం కింద మొదటి వాయిదా చెల్లింపు ఏప్రిల్, జూలై మధ్య జరుగుతుంది. రెండవ వాయిదా చెల్లింపు ఆగస్టు - నవంబర్ మధ్య జరుగుతుంది. మూడవ వాయిదా డిసెంబర్ - మార్చి నెలల మధ్య జరుగుతుంది.
గతేడాది తొలి విడత జనవరి 1న విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా కొత్త సంవత్సరం మొదటి రోజునే ప్రభుత్వం మరోసారి పీఎం కిసాన్ నిధిని పంపిణీ చేస్తుందని అంతా భావించారు. అయితే, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. జనవరి మూడు లేదా నాలుగో వారంలో నిధులు వచ్చే అవకాశం ఉంది.
జాబితాలో లబ్ధిదారుల పేరును ఎలా తనిఖీ చేయాలి: పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా 2023లో మీ పేరు ఉందో లేదో రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కు వెళ్లాలి. ఫార్మర్స్ కార్నర్కు వెళ్లి.. లబ్ధిదారుల జాబితాను సెలక్ట్ చేసుకోవాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, బ్లాక్/గ్రామానికి సంబంధించిన వివరాలు, ఇతర వివరాలు సమర్పించి.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్.. వెంటనే చెక్ చేసుకోండి.