
ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. ఈ పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా రూ.2,000 కోట్లకు పైగా వ్యయంతో 40 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధికి రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కీలకమైన నల్గొండ స్టేషన్ను రూ. 17.01 కోట్ల అంచనా వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుంది.

నడికుడి- బీబీ నగర్ సెక్షన్లో ఉన్న ఈ నల్గొండ రైల్వే స్టేషన్ను గుండా డెమూ, మెమూ సర్వీసులతో సహా రోజుకు సుమారు 44 రైళ్లు నడుస్తుండగా వీటిలో ప్రతిరోజూ దాదాపు 3,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి, వ్యాపారాల కోసం హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఈ స్టేషన్ ఒక కీలకమైన రవాణా కేంద్రంగా మారి, ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలకు ముందుకు తీసుకెళ్తోంది.

ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లో అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా పనులు చేపట్టారు. ఈ పథకం కింద మొత్తం 9,657 చదరపు మీటర్ల ప్లాట్ఫారమ్ ఉపరితలం మెరుగుదల పనులు, 3,309 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అదనపు పైకప్పు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల రాకపోకల కోసం 12 మీటర్ల వెడల్పు గల భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి, కాన్కోర్స్ అంతర్గత పునరుద్ధరణతో పాటు విఐపి లాంజ్, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్ల ఆధునీకరణ. అందమైన ఉద్యానవనంతో స్టేషన్ ప్రాంగణ అభివృద్ధి చేస్తున్నారు.

దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక వసతులు, ప్రయాణీకులను సులభంగా నడిపించే కొత్త డిజిటల్ సూచికలు, ఆధునిక ఫర్నిచర్, స్టేషన్ ఎంట్రెన్స్ వద్ద ఆకర్షణీయమైన డిజైన్లతో అలంకరించనున్నారు. ఇప్పటికే ప్లాట్ఫారాల పైకప్పులు, ప్రయాణికుల కోసం లిఫ్టుల ఏర్పాటు, ప్లాట్ఫారమ్ ఉపరితలాల మెరుగుదల పనులు పూర్తయ్యాయి. వీటితో పాటు అప్రోచ్ రోడ్డు అభివృద్ధి, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు, వెయిటింగ్ హాల్ల పునరుద్ధరణ పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి.

రైల్వే అధికారుల ప్రకటన : భారతీయ రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణకు కట్టుబడి ఉందని.. ఈ పునరాభివృద్ధి పనులు పూర్తి కావడం వల్ల నల్గొండ రైల్వే స్టేషన్ కేవలం ప్రయాణ కేంద్రంగానే కాకుండా, ప్రపంచ స్థాయి సేవలు, అత్యుత్తమ అనుసంధానంతో కూడిన ఒక చైతన్య కేంద్రంగా మారబోతోందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.