
కావాల్సిన పదార్థాలు : సజ్జలు అర కిలో, బెల్లం 500 గ్రాములు, నెయ్యి 10 టీస్పూన్స్, తెల్ల నువ్వులు, వేరుశనగలు 100 గ్రాములు, బాదం 75 గ్రాములు, ఎండు ద్రాక్ష 25 గ్రాములు, ఏలకుల పొడి వన్ టీ స్పూన్, శొంఠి పొడి పావు టీస్పూన్, ఉప్పు చిటికెడు.

తయారీ విధానం : ముందుగా స్టవ్ వెలిగించి, దానిపై పాన్ పెట్టుకొని సజ్జలను వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు సజ్జల పిండి రెడీ అయిపోయింది.

ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో కొంచె నెయ్యి వేసి, తెల్ల నువ్వులు, వేరుశనగ పప్పులు, బాదం, ఎండు ద్రాక్ష వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టి, అదే పాన్లో మరో టీ స్పూన్ నెయ్యి వేసి, మనం మిక్సీ పట్టుకున్న పిండిని దోర దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు వేయించిన నువ్వులు, పల్లీలు, బాదం అన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పొడిని పక్కన పెట్టుకొని, ఒక పెద్ద బౌల్ తీసి, అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న సజ్జల పిండిని, మిక్సీ పట్టిన వేరుశనగ, నువ్వుల మిశ్రమాన్ని వేసి, కొంచెం ఉప్పు వేసి, మంచిగా కలుపుకోవాలి.

ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి, అందులో అర కప్పు నీళ్లు పోసి, అవి మరిగిన తర్వాత బెల్లం వేసి, పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కొంచెం చల్లారిన తర్వాత అందులో సజ్జల పిండిని వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి.దీని తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని, సజ్జల పిండిని చిన్నగా లడ్డూల మాదిరి చుట్టకోవాలి. అంతే ఆరోగ్యాన్ని ఇచ్చే టేస్టీ టేస్టీ సజ్జల లడ్డూలు రెడీ. మరి మీరు కూడా మీ ఇంటిలో ప్రిపేర్ చేయండి