మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే.! బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉంది. ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది భారత వాతావరణం శాఖ.
వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు కోస్తాలో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని ఐఎండీ ప్రకటించింది. రాయలసీమలోనూ చెదురుమదురు వర్షాలు కురుస్తాయి.
తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటం వల్ల మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచిస్తోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
విశాఖ జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఎండ ఉన్నప్పటికీ.. భూమి వేడెక్కినప్పుడు బలమైన మేఘాలు ఏర్పడి వర్షాల కురుస్తుంటాయి. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అన్నమయ్యతో పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు.. దక్షిణ కోస్తా జిల్లాలైన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోనూ అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.