బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏడు దశాబ్దాలకు పైగా పాటు పరిపాలించిన క్వీన్ ఎలిజబెత్ 2 మరణించిన విషయం తెలిసిందే. ఆమె తర్వాత బ్రిటన్ను పాలించేందుకు రాణి కుమారుడు అయిన కింగ్ చార్లెస్ III బ్రిటన్ రాజుగా అధికారాలను స్వీకరించారు.
ఇక బ్రిటన్ కరెన్సీపై రాణి ఎలిజబెత్ 2 ఫొటోలు ఎన్నో ఏళ్ల నుంచి చలామణీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే రాణి తదనంతరం కరెన్సీపై ఫొటోల్లో మార్పు దిశగా అడుగుల ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగానే తాజాగా 5పౌండ్స్, 50 పెన్సుల నాణేలపై కింగ్ చార్లెస్ III ఫొటోల ముద్రీకరణ ప్రారభించారు. తాజాగా లండన్లోని రాయల్ మింట్ ఈ నాణేలకు సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది.
సాధారణంగా నాణేలు 20 ఏళ్ల పాటు పాడుకాకుండా ఉండగలవు. కాబట్టి ఇప్పటికే రాణి ఫొటోలతో ముద్రించిన 27 బిలియన్ల నాణేలను ఇప్పటికప్పుడు తొలగించమని మింట్ సీఈఓ అన్నే జోసఫ్ తెలిపారు. ఈ కారనంగానే కింగ్ చార్లెస్తో కూడిన నాణేలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి సమయం పడుతుందని తెలిపారు.
నాణేల మార్పుకు సంబంధించి వినియోగదారులపై ఎలాంటి పన్ను ఉండదని తెలిపారు. ఇక డిజిటల్ కరెన్సీకి ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో భవిష్యత్తులో నాణేల అవసరం తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే కరెన్సీపై ఫొటోల మార్పు ప్రస్తుతం కేవలం నాణేలకే పరిమితం చేయనున్నారు. నోట్లను యదాతథంగా కొనసాగించనున్నారు. అయితే కొత్త నోట్లను 2024 నాటికి చెలామణిలోకి వచ్చే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తెలిపింది.