
350 మంది మహిళలు.. ఒకే లక్ష్యం.. నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలంలోని 12 గ్రామాలకు చెందిన 350 మంది మహిళా రైతులు కలిసి 2023లో ‘లక్ష్మణచందా మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ ఏర్పాటు చేసుకున్నారు. మహిళల సమష్టి ఆలోచనకు కార్యరూపమే ఈ సమాఖ్య. సంస్థను పారదర్శకంగా నిర్వహించేందుకు 12 గ్రామాల నుంచి 12 మంది డైరెక్టర్లను, ఒక అధ్యక్షురాలిని ఎన్నుకున్నారు. బాధ్యతలను పంచుకుని.. సమష్టి నిర్ణయాలతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు.

రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందించడమే ధ్యేయంగా ఈ సమాఖ్య ను నడుపుతున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించడమే తమ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇది కేవలం అమ్మకాల కేంద్రం మాత్రమే కాదు.. రైతులకు సలహాలు ఇచ్చే వ్యవసాయ వేదిక కూడా అని నిరూపిస్తున్నారు.

పంటల కాలాన్ని బట్టి ఏ విత్తనం ఎంచుకోవాలి..? ఎప్పుడు ఎరువులు వేయాలి..? తెగుళ్లు వస్తే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి..? వంటి అంశాలపై రైతు సభ్యులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ గ్రామాభివృద్దికి పంటల సాగుకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు లక్ష్మణచందా మండల సమాఖ్య మహిళా రైతులు. సమాఖ్య సూచనలు, సలహాలు పాటిస్తున్న రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారని మహిళా రైతులు చెబుతున్నారు. నిన్నటి వరకు రైతు కుటుంబాలకి వ్యవసాయ కూలీలుగా తోడుగా ఉన్న మహిళలు.. నేడు రైతు కుటుంబాల వ్యవసాయ నిర్ణయాలకు మార్గదర్శకులుగా మారడం వారి కృషిని చాటుతుంది. వ్యవసాయ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ.. గ్రామీణ మహిళ సాధికారతకు కొత్త నిర్వచనం చెబుతున్నారు లక్ష్మణచందా మండల మహిళా రైతు సమాఖ్య.

2023లో ప్రారంభమైన ఈ సమాఖ్యను విజయవంతంగా కొనసాగిస్తున్న మహిళలు.. ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందితే తమ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తున్నారు. ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు కేంద్రం మంజూరు చేస్తే రైతులకు మరింత చేరువ కావడంతో పాటు.. సమాఖ్యకు కూడా మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ఒకప్పుడు ఇంటి గడప దాటని మహిళా చేతులు.. ఇప్పుడు వ్యవసాయ వ్యాపారాన్ని నడిపిస్తున్నాయి.

విత్తనాలు, మందులు, యూరియా రైతు పంటకు అవసరమయ్యే అన్ని సరుకులు అమ్ముతున్నారు.. రైతులకు సలహాలు సైతం ఇస్తున్నారు.. మార్కెట్ను అర్థం చేసుకుంటున్నారు.. సంస్థను మరింత ముందుకు తీసుకెళుతున్నారు. ఇది కేవలం ఓ మహిళా సమాఖ్య విజయగాథ కాదు. గ్రామీణ భారతంలో మారుతున్న మహిళా శక్తికి ప్రతీక.వ్యవసాయంలో మహిళలు కూలీలుగా కాదు.. నిర్ణయాధికారులుగా ఎదుగుతున్నారనడానికి లక్ష్మణచందా మహిళా రైతులే సజీవ సాక్ష్యం. మహిళలే మహారాణులు.. వ్యవసాయం కూడా వారి సామ్రాజ్యమే.. సమష్టి కృషే వారి విజయ మంత్రం.