
డెన్మార్క్లో ఒక వృద్ధుడు తాజాగా కనిపిస్తున్న కొబ్బరికాయను కొట్టించుకుని నీళ్లు తాగాడు. తాగిన మూడు గంటలకే అతనికి విపరీతంగా చెమటలు పట్టడం, వాంతులు, వికారం మొదలయ్యాయి. ఆసుపత్రికి తరలించేసరికి అతను గందరగోళానికి గురై, కండరాల కదలికలపై నియంత్రణ కోల్పోయాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కేవలం 26 గంటల్లోనే అతని శరీరంలోని కీలక అవయవాలన్నీ విఫలమై మరణించాడు.

మృత్యుపాశం: పరిశోధనలో తేలిన అంశం ఏంటంటే.. వైద్యులు నిర్వహించిన కొబ్బరి నీరు సేవించిన తర్వాత ప్రాణాంతకమైన 3-నైట్రోప్రొపియోనిక్ విషం వల్ల చనిపోయినట్లు అధ్యయనంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆ కొబ్బరి నీళ్లలో 3-నైట్రోప్రొపియోనిక్ యాసిడ్ అనే శక్తివంతమైన శిలీంధ్ర విషం ఉన్నట్లు గుర్తించారు. బయటకు కాయ తాజాగా కనిపిస్తున్నా లోపల ఈ విషపూరిత శిలీంధ్రాలు వృద్ధి చెందుతాయి.

ఇది ఎలా చేరుతుంది?: కొబ్బరికాయలు కోసిన తర్వాత వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే, ముఖ్యంగా వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో ఉంచినప్పుడు, పెంకుపై ఉండే సూక్ష్మ పగుళ్ల ద్వారా ఆర్త్రోబీనియం వంటి శిలీంధ్రాలు లోపలికి ప్రవేశిస్తాయి. ఇవి నీటిలో చేరి 3-NPA అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. బయటకు కాయ ఎంతో తాజాగా కనిపిస్తున్నా, లోపల మాత్రం ఈ నిగూఢ విషం తయారవుతుంది.

కలుషిత కొబ్బరి నీళ్లు తాగిన కొద్ది గంటల్లోనే వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి రావచ్చు. 3-NPA నేరుగా మెదడును, నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనివల్ల మూర్ఛలు, కండరాల అసాధారణ సంకోచాలు సంభవిస్తాయి. ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం, ఛాతి బిగుతుగా మారి శ్వాస తీసుకోవడం కష్టమవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విషం తీవ్రత పెరిగితే కాలేయం, కిడ్నీలు దెబ్బతిని మరణం సంభవించవచ్చు.

నీరు తాగేటప్పుడు కొంచెం పుల్లగా ఉన్నా, రుచి మారినా లేదా అసాధారణ వాసన వస్తున్నా వెంటనే ఆ నీటిని పారేయండి. ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లను పాశ్చరైజేషన్ చేస్తారు కాబట్టి, అవి నేరుగా చిప్ప నుండి తాగే వాటికంటే కొన్నిసార్లు సురక్షితం. కొబ్బరికాయలను చల్లని ప్రదేశంలో ఉంచండి. అయితే ఫ్రిజ్లో ఉంచినంత మాత్రాన ప్రమాదం పూర్తిగా పోదు, తాగే ముందు తనిఖీ ముఖ్యం. గర్భిణీలు, చిన్న పిల్లలు మరియు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పచ్చి, శుద్ధి చేయని కొబ్బరి నీటిని తాగేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.