
పల్లీలు, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి మరియు తిరగమాతతో చేసుకొనే ఈ పొడిలో కొన్ని నీళ్లు పోసి కలిపితే క్షణాల్లో రుచికరమైన పల్లీ చట్నీ సిద్ధమవుతుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి ఈ పొడి కలుపుకుని తిన్నా అమృతతుల్యంగా ఉంటుంది.

ఈ ఇన్స్టంట్ చట్నీ పొడి తయారీ కోసం ముందుగా బాండీలో ఒక కప్పు పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్పై ఎర్రగా వేయించి పక్కన తీయాలి. అదే బాండీలో ముప్పావు కప్పు పుట్నాల పప్పు, పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలను వేర్వేరుగా ఒకటిరెండు నిమిషాలు వేయించాలి.

తరువాత టేబుల్ స్పూన్ నూనెలో 15-20 ఎండుమిరపకాయలు, పిడికెడు కరివేపాకును క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. ఆపై రెండు టేబుల్ స్పూన్ల మినపప్పును దోరగా వేయించి తీయాలి. స్టవ్ ఆఫ్ చేసి వేడి పాన్లో 10 గ్రాముల చింతపండు వేసి వెచ్చబడనివ్వాలి.

చల్లారిన తర్వాత వీటన్నింటితో పాటు 8-9 వెల్లుల్లి పాయలు, టీస్పూన్ జీలకర్ర, టీస్పూన్ ఉప్పు చేర్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. పల్స్ మోడ్లో ఆపుతూ ఆపుతూ మెత్తటి పొడిలా రుబ్బుకోవాలి.

బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసి, చల్లారాక మిక్సీ పట్టిన చట్నీ పొడిలో బాగా కలుపుకోవాలి. గాలి తగలకుండా జార్లో భద్రపరిస్తే 15-20 రోజులు తాజాగా ఉంటుంది. కావలసినప్పుడు పొడిలో తగినన్ని నీళ్లు కలిపితే రుచికరమైన చట్నీ రెడీ అవుతుంది.