ఆదాయపు పన్ను దాఖలుకు చివరి తేదీ జూలై 31 తర్వాత పొడిగించేది లేదని ఒక వైపు అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. FY 2022-23, అసెస్మెంట్ ఇయర్ 2023-24 కోసం ఆదాయపు పన్ను రిటర్న్ను ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2023. కానీ దేశంలోని అనేక రాష్ట్రాల్లో వరదలు, వర్షాల కారణంగా ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి తేదీని పొడిగించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను డిమాండ్ చేస్తున్నారు.
దేశంలోని అతిపెద్ద పన్ను నిపుణుల సంఘం సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆర్థిక మంత్రికి లేఖ రాసింది. రాజధాని ఢిల్లీలో వరదల కారణంగా ఐటీఓలో ఉన్న ఆదాయపు పన్ను కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలు మూతపడ్డాయని ఆ సంస్థ ఆర్థిక మంత్రికి లేఖ రాసింది.
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీ చాలా దగ్గరగా ఉందని సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ లేఖలో పేర్కొంది. అటువంటి పరిస్థితిలో పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు చివరి తేదీకి ముందు అన్ని రకాల పత్రాలను సమర్పించడం కష్టం. అటువంటి పరిస్థితిలో ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలుకు చివరి తేదీని ఆగస్టు 31, 2023 వరకు ఒక నెల పొడిగించాలని అసోసియేషన్ ఆర్థిక మంత్రిని కోరింది.
అయితే భారీ వర్షాల ప్రభావం కేవలం ఢిల్లీకే పరిమితం కాదని, దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ సమస్య ఉందని, దీని కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపింది.
ఇటీవల రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలు తేదీని పొడిగించే ఆలోచనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదని ఆయన అన్నారు. అయితే భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలు తేదీని పొడిగించాలనే డిమాండ్ ఉంది. ఈ వరదల కారణంగా తేదీని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జూలై 18, 2023 వరకు 3.06 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. గతేడాది కంటే ఈ ఏడాది 7 రోజుల ముందుగానే ఈ మైలురాయిని సాధించింది. ఇందులో 2.81 ఐటీరప్లు ఇ-వెరిఫై చేయబడ్డాయి. 1.50 కోట్ల ఐటీఆర్లు ప్రాసెస్ చేయబడ్డాయి. త్వరలో రిటర్నులు దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ ప్రజలను అభ్యర్థించింది.