
Heavy Rains: ఎక్కడ చూసినా వరదలే వరదలు.. చెరువులకు గండ్లు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.. జలకళను సంతరిచుకున్న రిజర్వాయర్లు.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది.. తెలంగాణలో మాత్రం ఆ జిల్లా.. ఈ జిల్లా అనే తేడాయే లేదు.. అన్ని జిల్లాల్లోనూ వరుణుడు వరద బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వర్షాలతో దాదాపు అన్ని జిల్లాలు తల్లడిల్లుతున్నాయి. కొన్నిచోట్ల వరదల్లో కొందరు గల్లంతు కాగా.. పలువురు మరణించారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మళ్లీ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది.

తెలంగాణలో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లోకి నీరు చేరింది.

22 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురంభీమ్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, నల్గొండ, రంగారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డికి ఆరెంజ్ అలర్ట్.. నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.

కాగా.. ఏపీలో సైతం వరుణుడు బీభత్సం కొనసాగుతోంది. అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా మరియు దీనిని ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీద కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని.. అంతేకాకుండా రుతుపవన ద్రోణి సైతం విస్తరించిందని తెలిపింది.

ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజులపాటు ఏపీలో తెలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలతోపాటు.. గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది.