
నేటి చెడు జీవనశైలి కారణంగా ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, సరైన చర్మ సంరక్షణ జాగ్రత్తలు అనుసరించాలి. ముఖ్యంగా అధిక మంది తరచుగా మొటిమల సమస్యతో బాధపడుతుంటారు. ముఖంపై మొటిమలు వస్తే.. అనతి కాలంలోనే ముఖంపై నల్లని మచ్చలు ఏర్పడతాయి.

చాలా మంది ఈ మొటిమలను చేతులతో గిల్లుతుంటారు. దీని కారణంగా చర్మంపై నల్లని గుర్తులు ఏర్పడతాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు మొటిమల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. మీ ముఖంపై కూడా మొటిమలు అధికంగా ఉంటే ఈ కింది సింపుల్ చిట్కాలను అనుసరించండి. తద్వారా తేలిగ్గా ఈ సమస్య నుండి బయటపడతారు.

ముఖంపై మొటిమలను నివారించాలనుకుంటే, ముఖాన్ని రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి. ముఖం కడుక్కోవడం వల్ల ముఖంపై అంటుకున్న దుమ్ము, ధూళి అన్నీ తొలగిపోతాయి. మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సున్నితమైన క్లెన్సర్ ఉపయోగించవచ్చు. మీ ముఖాన్ని కడిగిన తర్వాత మాయిశ్చరైజ్ రాయాలి.

చర్మం పొడిగా ఉండకుండా ప్రయత్నించాలి. అందుకు చర్మాన్ని హైడ్రేట్ చేయడం ముఖ్యం. దీని కోసం రోజూ తగినంత నీరు త్రాగాలి. ఆల్కహాల్ ఫ్రీ క్రీమ్ను ముఖానికి రాసుకోవాలి. ఇది పొడి చర్మం చర్మ సమస్యలను నివారిస్తుంది.

అలాగే ముఖాన్ని పదే పదే తాకడం వల్ల మొటిమలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో ముఖంపై క్రీమ్ను అప్లై చేసే ముందు చేతులు, గోళ్లను ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది ముఖంపై బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా చేస్తుంది. అలాగే విటమిన్ ఎ, బి 12, సి తోపాటు బీట్రూట్, ఆరెంజ్, బాదం ఆహారాలు తీసుకోవాలి. ఇవి చర్మం మెరిసిపోయేలా చేసి, మొటిమలు రాకుండా నివారిస్తాయి.