
మీల్ మేకర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలాగే గోంగూరలోని పులుపు సోయా చంక్స్కు పట్టుకుని కర్రీ అత్యంత అద్భుతమైన రుచిని ఇస్తుంది. వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకుని తింటే కడుపు నిండినా ఇంకా తినాలనిపిస్తుంది. ఈ కర్రీ తయారీకి ముందుగా ఒక పాత్రలో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి, నాలుగు పచ్చిమిర్చి, 150 గ్రాముల శుభ్రం చేసిన గోంగూర ఆకులు, 10 నుండి 15 వెల్లుల్లి రేకలు వేసి సన్నని మంటపై వేయించాలి.

గోంగూర బాగా వేగి జిగురు వదిలిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు వేసి వేయించాలి. జీడిపప్పు వేయడం వల్ల కర్రీ చిక్కబడి అన్నంలోకి బాగా కలుస్తుంది. ఇవన్నీ వేగాక చల్లార్చి మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ తయారీ కోసం బాణలిలో 6 నుండి 7 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి.

గోంగూరకు కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది. వేడెక్కిన నూనెలో రెండు ఎండుమిర్చి, టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు వేయించాలి. ఆపై అర కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేలా వేయించి, ఒక కప్పు టొమాటో తరుగు వేసి మెత్తగా మగ్గనివ్వాలి.

టొమాటోలు గుజ్జుగా అయిన తర్వాత ధనియాల పొడి, కారం, వేపిన జీలకర్ర పొడి, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి మసాలా నూనె తేలే వరకు వేయించాలి. ఇలా వేగిన మసాలాలో ముందుగానే వేడినీళ్లలో నానబెట్టి, గట్టిగా పిండిన సోయా చంక్స్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత మూతపెట్టి మరో 3 నుండి 4 నిమిషాలు మగ్గిస్తే మసాలాలోని ఫ్లేవర్స్ అన్ని సోయా చంక్స్ కి బాగా పడతాయి.

ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్, కప్పున్నర వేడినీళ్లు పోసి బాగా కలిపి, మూతపెట్టి 4 నుండి 5 నిమిషాలు ఉడికించాలి. కర్రీ దగ్గరపడి నూనె పైకి తేలాక, కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర చల్లుకుని దింపేస్తే ఎంతో రుచికరమైన గోంగూర సోయా కర్రీ సిద్ధమవుతుంది. చల్లారే కొద్దీ గ్రేవీ చిక్కబడుతుంది కాబట్టి కాస్త జారుగా ఉన్నప్పుడే దింపుకోవాలి.