
హోటళ్లలో లభించే ఆ ప్రత్యేకమైన రుచితో ఇంట్లోనే ఎంతో సులభంగా ఇడ్లీ కారప్పొడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ కారప్పొడి తయారీకి ప్రధానంగా పప్పు ధాన్యాలు, ఎండుమిర్చి సరైన నిష్పత్తిలో వేయించుకోవడం చాలా ముఖ్యం. ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి సన్నని మంటపై పావు కప్పు మినపప్పు, పావు కప్పు పచ్చిశెనగపప్పు వేసి దోరగా వేయించాలి.

పప్పులు మాడిపోకుండా లోపలి వరకు వేగి మంచి సువాసన వచ్చేలా వేయించుకోవడమే ఇందులో ఉన్న అసలు రహస్యం. ఇవి వేగిన తర్వాత వేరే ప్లేట్ లోకి తీసుకుని, అదే బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలు, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి ఒక్క నిమిషం పాటు వేడికి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ మెంతులు వేయాలి. అనంతరం కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి. మంచి రంగు కోసం బ్యాడిగి మిర్చి, ఘాటు కోసం గుంటూరు మిర్చిలను కలిపి వాడుకుంటే పొడి రంగు, రుచి అద్భుతంగా ఉంటాయి. మిర్చితో పాటు కాసింత కరివేపాకు, చిన్న ముక్క చింతపండు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆపేయాలి.

ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, పావు టీస్పూన్ ఇంగువ, 10 నుండి 12 వెల్లుల్లి రేకలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఘుమఘుమలాడే హోటల్ స్టైల్ ఇడ్లీ కారప్పొడి సిద్ధమైనట్లే! ఈ పొడిని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకుంటే బయట ఉంచినా మూడు వారాల పాటు, ఫ్రిజ్ లో ఉంచితే రెండు నెలల వరకు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది.

ఈ కారప్పొడి కేవలం ఇడ్లీలకే కాకుండా గీ కారం దోశ, మసాలా దోశ, మినప వడలు, చివరికి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ పొడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి, మీ కుటుంబ సభ్యులకు కమ్మటి రుచిని అందించండి.