
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే..ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి,రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు, ఒక టేబుల్స్పూన్ పచ్చి కొబ్బరి తురుము, అర టీస్పూన్ యాలకుల పొడి, బెల్లం పావు టీస్పూన్ వంట సోడా, ఒక టీస్పూన్ సోంపు .

తయారీ విధానంలోకి వెళితే.. బెల్లం, గోధుమ పిండితో తీపి బోండాలు తయారు చేయడానికి ముందుగా కప్పు బెల్లం తీసుకోవాలి. అలాగే దానికి సరిపడ నీళ్లు పోయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, స్టవ్ పై బెల్లం నీళ్లు కలిపిన పాన్ పెట్టి, బెల్లం కరిగే వరకు నీటిని కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వలన బెల్లం కరిగి పోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నీళ్లు చల్లారనివ్వాలి.

ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండిని వేసి జల్లెడ పట్టాలి. తర్వాత ఈ పిండిలో రెండు నుంచి మూడు టీ స్పూన్ల బొంబాయి రవ్వను కలపాలి. బొంబాయి రవ్వ కలపడం వలన బోండాలు క్రిస్పీగా ఉంటాయి. మంచి రుచి వస్తాయి. తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు, పచ్చికొబ్బరి తురుము, యాలకుల పొడి అన్నీ వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులో మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లం నీళ్లు పోస్తూ పిండిని మంచిగా కలుపుకోవాలి.

తర్వాత కొన్ని నీళ్లు పోసి, అచ్చం బోండా పిండిలా కలుపుకోవాలి. చేతులతో రెండు మూడు నిమిషాల పాటు బీట్ చేసినట్లు బాగా కలపాలి. ఇలా కలపడం వలన పిండి ప్లఫీగా మారి, బోండాలు స్పాంజీగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ బోండాలు వేయడానికి సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో వంట సోడా కలపాలి. దీని వలన బోండాలు పొంగి చాలా మంచిగా వస్తాయి.

ఇక ఇప్పుడు బోండాలు వేయడానికి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. అందులో బోండాలు వేయించడానికి సరిపడ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత అందులో పిండిని చేతితో తీసుకొని బోండా ఆకారంలో వేసుకోవాలి. నూనెలో సరిపడా బోండాలు వేసిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్కు సర్దుబాటు చేసి, బోండాలు బంగారు రంగు వచ్చేవరకూ తిప్పుతూ ఫ్రై చేయాలి. బెల్లం వాడటం వలన బోండాలు త్వరగా రంగు మారతాయి, కాబట్టి జాగ్రత్తగా వేయించాలి. లోపల పచ్చిగా ఉండకుండా, పూర్తిగా ఉడకడానికి మీడియం మంటపై వేయించడం తప్పనిసరి. ఇవి ముదురు రంగులోకి మారి, పైన క్రిస్పీగా మారినప్పుడు నూనె నుండి తీసివేయాలి. అంతే టేస్టీ టేస్టీ బోండాలు రెడీ.