
శీతాకాలంలో లభించే సీజనల్ పండ్లలో జామపండ్లు ముందు వరుసలో ఉంటాయి. ఇవి రుచికి మాత్రమేకాదు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కాలంలో జామపండు సహజంగా పండి తాజాగా ఉంటాయి. దీంతో ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జామ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది.

జామకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జామకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది నిర్జలీకరణాన్ని నివారిస్తుంది. ఎన్ని లాభాల ఉన్ననప్పటికీ కొంతమందికి శీతాకాలంలో జామ పండ్లు మేలు కంటే హాని ఎక్కువ తలపెడతాయి. అలాంటి వారు వీటికి దూరంగా ఉండటం మంచిది.

జామపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని అధికంగా తింటే విరేచనాలు, కడుపు నొప్పిని పెంచుతుంది. ముఖ్యంగా చల్లగా ఉండే వాతావరణంలో జామపండు తినడం వల్ల గొంతులో అసౌకర్యం పెరుగుతుంది. అలాగే జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు జామపండును ఎక్కువగా తినకూడదు.

ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయంలో జామపండ్లను అస్సలు తినకూడదు. కడుపులో గ్యాస్, ఆమ్లత్వంతో బాధపడేవారు కూడా ఎక్కువగా జామపండు తినకూడదు. ఈ సమస్య ఉన్నవారు జామ విత్తనాలను తొలగించి తినడం మంచిది. లేకుంటే కడుపు నొప్పి వస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారు కూడా జామపండ్లను ఎక్కువగా తినకూడదు. అలాగని పూర్తిగా మానేయకూడదు. మితంగా తినవచ్చు. ముఖ్యంగా మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే జామ పండ్లు తినాలి.