
కొందరికి సాల్ట్ ఫుడ్ అంటే ఇష్టం అయితే మరికొందరు తీపి ఆహారాన్ని ఇష్టపడతారు. అయితే పచ్చి మిరపకాయలను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. డిన్నర్ అయినా, లంచ్ అయినా పచ్చి మిరపకాయ తప్పనిసరి. అదే సమయంలో కొంత మంది పచ్చి మిర్చికి బదులుగా కారం పొడిని ఉపయోగిస్తారు. అయితే ఇలా ఆహారంలో పచ్చి మిర్చికి బదులుగా కారం పొడిని ఉపయోగించడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. అయితే మిరప పొడిని కూరల్లో ఎక్కువగా ఉపయోగించడం వలన కడుపులో ఇన్ఫెక్షన్ల నుండి జీర్ణ సమస్యల వరకు వివిధ శారీరక సమస్యలు తలెత్తుతాయి.

అయితే కూరల్లో కారం పొడికి బదులుగా పచ్చి కారం వేసి వండితే ఏం లాభం? పచ్చి మిర్చి తినడం వల్ల శరీరానికి మంచిదా, చెడ్డదా? పచ్చిమిర్చితో వండటం లేదా ఒక పచ్చిమిర్చి తింటే శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం

విటమిన్ల మూలం: పచ్చి మిరపకాయలో విటమిన్ B6, విటమిన్ A, ఇనుము, కాపర్, పొటాషియంలతో పాటు కొద్ది మొత్తంలో ప్రోటీన్ , కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ముఖ్యంగా దీనిలోని ఏ విటమిన్ ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలు, శ్లేష్మ పొరలను నిర్వహించడానికి సహాయపడుతుంది. మిరపకాయల్లో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చిమిర్చి వివిధ రకాల చర్మ సమస్యలను నయం చేస్తుంది. ముఖం సులభంగా ముడతలు పడకుండా చేస్తుంది.

జీర్ణక్రియలో సహాయపడుతుంది: పచ్చి మిరపకాయలు ఆహారాన్ని జీర్ణం చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి. నూనె, మసాలా వంటలలో కారం పొడి ఉపయోగించడాన్ని తగ్గించండి. కారం పొడి ఆహారానికి రంగు, రుచిని జోడిస్తుంది. అయితే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అదే పచ్చి మిర్చి అయితే జీర్ణక్రియకు సహాయపడుతుంది.

నొప్పిని తగ్గిస్తుంది: పచ్చి మిరపకాయలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. పచ్చిమిర్చి మైగ్రేన్ , ఆర్థరైటిస్ నొప్పిని కూడా నియంత్రిస్తుంది.

మెటబాలిజం రేటును పెంచుతుంది: పచ్చిమిర్చి తినడం వల్ల శరీరంలో ఒక రకమైన వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడుతుంది. పచ్చి మిర్చి శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో, కేలరీలను బర్న్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: పచ్చి మిరపకాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చి మిరపకాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంటు జ్వరం, జలుబు నుండి కాపాడుతుంది. మిరపకాయలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది కణాల నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తుంది.