మెరిసే చర్మాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. చాలా మందికి చిన్న వయసులోనే ముఖం ముడుతలు పడి పెద్ద వయసువారిలా కనిపిస్తుంటారు. ఈ ముడుతలు తొలగించుకోవడానికి రకరకాల కాస్మోటిక్స్ వాడుతుంటారు. కానీ మార్కెట్లో దొరికే వివిధ సౌందర్య సాధనాలు చర్మానికి మేలుకు బదులు నష్టాన్ని కలిగిస్తాయి.
కానీ ఇంట్లోనే ఒక చిన్న ట్రిక్ ద్వారా చర్మ సౌందర్యాన్ని క్షణాల్లో పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా శరీరంలో ఈ భాగాలను మసాజ్ చేయడం ద్వారా చర్మం స్థితిస్థాపకతను పునరుద్ధరించవచ్చట. చర్మ కాంతిని పునరుద్ధరించడానికి చెవులు, రొమ్ముల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా మసాజ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతి ఆయుర్వేదం, పురాతన చైనీస్ వైద్యంలో కూడా ప్రసిద్ధి చెందింది.
శరీరంలోని వివిధ భాగాలు చెవితో ముడిపడి ఉన్నాయని సైన్స్ కూడా చెబుతోంది. కాబట్టి చెవులను మసాజ్ చేయడం వల్ల శరీరం అంతర్గత సమన్వయం మెరుగుపడుతుంది. అందుకే ఫేషియల్ సమయంలో ముఖం, చెవికి ప్రక్కనే ఉన్న ప్రాంతాన్ని కూడా మసాజ్ చేస్తుంటారు. చెవుల చుట్టూ కొన్ని ప్రెజర్ పాయింట్లు ఉంటాయి. వీటిని ఉద్దీపన చేసినప్పుడు చర్మ ఆరోగ్యం పెంపొందుతుంది.
చెవి మసాజ్ ఎలా చేయాలంటే.. ఇయర్లోబ్ వెనుక నుంచి మసాజ్ చేయడం ప్రారంభించాలి. ఇలా తేలికగా చేతులతో చెవి పైభాగం వరకు నెమ్మదిగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసేటప్పుడు చేతులకు ఫేస్ క్రీమ్ లేదా ఫేషియల్ ఆయిల్ అప్లై చేస్తే ఇంకా మంచిది.
చెవులను విడిగా మసాజ్ చేయడానికి సమయం లేకపోతే.. మీరు ప్రతిరోజూ 'క్లెన్సింగ్', 'టోనింగ్', 'మాయిశ్చరైజింగ్' చేసుకన్న తర్వాత చెవులను కూడా ఒకేసారి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది.