
రాష్ట్ర పండడగా నిర్వహించే గంగ జాతర తిరుపతిలో కొత్త శోభను తెచ్చింది. డప్పుల దరువులతో హోరెత్తిస్తోంది. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో భక్తుల సందడి కొనసాగుతోంది.

ప్రతి ఏడాది మే నెలలో జరిగే ఈ జాతర కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరకు చాటింపు వేసి పొలిమేర్లను అష్టదిగ్బంధనం చేయడంతో తిరుపతి మొత్తం జాతర సంబరం ప్రతి ఇంటా కనిపిస్తోంది. తిరుమల వెంకటేశ్వర స్వామికి సోదరిగా భావించబడే గంగమ్మ దేవిని తాతయ్యగుంటలో గంగమ్మ దేవాలయంలో పూజిస్తారు.

గంగ జాతరలో వేషాలదో ప్రత్యేకత. భక్తులు చిత్ర విచిత్ర వేషాలతో అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. అంతే కాదు బూతులు తిడుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించడం మరో స్పెషల్. ఇలా జాతరలో పౌరాణిక చారిత్రక వేషాలతో పాటు సాంఘిక వేషాలు వేసి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు భక్తులు.

గంగమ్మను శ్రీవారి సోదరిగా భావించే టీటీడీ ప్రతియేటా అమ్మవారికి సారెను సమర్పిస్తుంది. ఈ సారి టీటీడీ తరపున ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామల రావు అమ్మవారికి సారెను సమర్పించారు. ఏటా అమ్మవారికి టిటిడి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

జాతరలో ఈ నెల 13 న అర్ధరాత్రి కీలక ఘట్టంగా గంగమ్మ విశ్వరూప దర్శన మిస్తారు. వేలాది మంది భక్తుల మధ్య అమ్మవారి మట్టి ప్రతిమకు పూజలు నిర్వహించనున్న కైకాల వంశస్థులు పేరంటాల వేషంలో చెంప నరకడం ద్వారా జాతర ముగుస్తుంది.