
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ కురవృద్దుడు మన్మోహన్ సింగ్(92) కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1932 సెప్టెంబర్ 26న ఇప్పటి పాక్లోని చక్వాల్లో మన్మోహన్ సింగ్ జన్మించారు. 2004-14 వరకు ప్రధానమంత్రిగా ఆర్ధిక సంస్కరణలకు పెద్ద పీట వేశారాయన. జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, నరేంద్ర మోదీ తర్వాత అత్యధిక కాలం దేశ ప్రధానిగా కొనసాగారు మన్మోహన్ సింగ్.

సుమారు 33 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్ సింగ్.. 1991లో రాజ్యసభలో అడుగుపెట్టారు. పీవీ నరసింహరావు హయాంలో ఆర్ధిక మంత్రిగా పనిచేశారు. ఆర్ధిక శాఖలో సలహాదారుగా, కార్యదర్శిగా, ఆర్బీఐ గవర్నర్గా కూడా వివిధ పదవులు చేపట్టారు.

మన్మోహన్ సింగ్ మరణ వార్త తెలిసిన వెంటనే.. ఆయన కుటుంబసభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలంటూ వారికి భరోసాను ఇచ్చారాయన.

ఆనాడు ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపడుతున్న మన్మోహన్ సింగ్ను రాజకీయాలకు పరిచయం చేసింది అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు అనే చెప్పాలి. పీవీ నరసింహరావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పని చేశారు. ఆ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు.

1991లో దేశం దుర్భర ఆర్ధిక పరిస్థితులను ఎదుర్కుంటున్న సమయంలో.. మన్మోహన్ సింగ్ను రాజ్యసభకు పంపి ఆర్ధిక మంత్రిని చేశారు పీవీ నరసింహరావు. Liberalisation, Privatisation, Globalisation పాలసీతో దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టారు సింగ్. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా నాటి ఆర్ధిక సంస్కరణలు నేటికీ చిరస్థాయిగా నిలిచాయని చెప్పాలి.

1991 ఆర్థిక సంస్కరణలు, సమాచార హక్కు చట్టం-2005, NREGA (ఇప్పుడు MGNREGA), ఇండో-యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్, 2008, విద్యా హక్కు చట్టం-2009, జాతీయ ఆహార భద్రతా చట్టం-2013, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM), అధిక GDP వృద్ధి రేటు, బంగారు చతుర్భుజం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పటిష్టమైన విదేశాంగ విధానం.. ఈ పది మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానంలో సాధించిన విజయాలు అని చెప్పొచ్చు.