
బిజీ లైఫ్స్టైల్ కారణంగా చాలా మంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) చేయకుండానే ఆఫీసులకు పరుగులు తీస్తుంటారు. దాదాపు ప్రతి రోజూ చాలా మంది ఇలా అల్పాహారం తీసుకోవడం మానేస్తుంటారు.. నిజానికి ఇలా అల్పాహారం మానేసే అలవాటు ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా..?

తాజాగా దీనిపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. పట్టణాల్లో నివసించే ప్రతి నలుగురిలో ఒకరు అల్పాహారం మానేస్తున్నట్లు సమాచారం. 72 శాతం మంది భారతీయులు తమ బ్రేక్ ఫాస్ట్లో పౌష్టికాహారం తీసుకోవడం లేదని సర్వే వెల్లడించింది. అయితే బ్రేక్ ఫాస్ట్ మానేస్తే శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట ఆహారం తీసుకున్న తర్వాత చాలా సమయం పాటు ఆహారం తినడం ఆగిపోతుంది. అందువల్ల ఉదయం వేళ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ శరీరానికి కావల్సిన శక్తిని, పోషకాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు పోషణకు బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం.

అల్పాహారం మానేయడం వల్ల శరీరంలోని జీవక్రియ రేటుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో బరువు పెరగడం, శరీరంలో ఎనర్జీ లెవల్స్ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ఉదయం పూట పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి. కానీ దానిని విస్మరిస్తే, పోషకాహార లోపం తలెత్తుతుంది. ఇది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఉదయాన్నే తగినంత ఆహారం తీసుకుంటే, ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇలా చేయడంలో విఫలమైతే మధ్యాహ్న భోజనం అతిగా తినే ధోరణి పెరుగుతుంది. ఇలా మితిమీరి తినడం వల్ల బరువు సలువుగా పెరిగిపోతారు.