
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్పై మోసం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని సాధారణ వినియోగదారులను ఫ్లిప్కార్ట్ మోసం చేస్తోందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎక్స్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ ద్వారా చాలా మంది ఫ్లిప్కార్ట్ను బాయ్కాట్ చేయాలని అంటున్నారు. ఫ్లిప్కార్ట్ ఆఫర్ పేరుతో మోసం చేసిందంటూ జనం ముందుకు వస్తున్నారు.

ఫ్లిప్కార్ట్ 99 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. Flipkart Motorola G85 5G స్మార్ట్ఫోన్ను అందిస్తోంది. చాలా మంది ఈ ఆఫర్ని చూసి ఫోన్ ఆర్డర్ చేశారు. కానీ ఈ ఆర్డర్ చేసిన ఉత్పత్తి ఎవరికీ చేరలేదు. కొన్ని ఆర్డర్ చేసిన గంటల్లోనే, మరికొన్ని ఒకటి లేదా రెండు రోజుల తర్వాత రద్దు అవుతున్నాయి. ఫోన్ కోసం ఎదురుచూస్తున్న పలువురు ఫిర్యాదులతో ముందుకు వచ్చారు.

సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ను బహిష్కరించాలని అంటున్నారు. #flipkaartscam, #boycoatflipkart వంటి హ్యాష్ట్యాగ్లను షేర్ చేస్తున్నారు. డిస్కౌంట్ల పేరుతో ఫ్లిప్కార్ట్ మోసాలకు పాల్పడుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇటువంటి ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి భారతదేశంలో ఎటువంటి చట్టం లేదని, ఇలాంటి మోసపూరిత ఆఫర్లు ఇవ్వడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు.

ఫ్లిప్కార్ట్లో మోటరోలా 17,999 అసలు ధరపై డిస్కౌంట్ ఇచ్చింది. దీంతో ఈ ఫోన్ రూ.179కే లభ్యం కానుంది. ఈ ఆఫర్ కింద డెలివరీ ఛార్జీలతో సహా ఫోన్ను ఆర్డర్ చేయడం ప్రతి వ్యక్తికి కేవలం రూ. 222 మాత్రమే. ఇది చూసిన జనం పెద్దఎత్తున ఫోన్ ఆర్డర్ చేశారు. తీరా చూస్తే ఆర్డర్ చేసిన కొన్ని గంటల్లోనే క్యాన్సిల్ అవుతున్నాయని ఆరోపిస్తున్నారు.

అయితే కొందరైతే తమకు ఆర్డర్ అందలేదని, ఫోన్ డెలివరీ అయినట్లు ఫ్లిప్కార్ట్ చూపిస్తోంది. ఫోన్ అందుబాటులో లేకుండా డెలివరీ చేశారని ఎలా అంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యపై కంపెనీ స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై ఫ్లిప్కార్ట్ ఇంకా స్పందించలేదు.