
మొక్కలతో ప్రత్యేకంగా రూపొందించిన సస్య గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినాయక నవరాత్రి ఉత్సవాల ద్వారా భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

16 వేల మొక్కలతో గణపతి విగ్రహాన్ని రూపొందించాలని అనుకున్నారు కానీ.. అంతకుమించి ఈ వినాయక విగ్రహం ఏర్పాటు చేసేందుకు మొక్కలు వినియోగించారు. 21 అడుగుల ఎత్తు వరకు విగ్రహం తీర్చిదిద్దారు . వినాయక ప్రతిమతో పాటు పరిసర ప్రాంతాలను మొక్కలతో అలంకరించారు.

అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రతిబింబించేలా మరో 60 వేల మొక్కలతో ఏర్పాటు చేసిన మండపం, ప్రతిమను ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సస్య గణపతి విగ్రహం కోసం మొక్కలను కడియపులంకలో పెంచారు. ఆర్గానిక్ పద్ధతిలో పెంచి ప్రత్యేకంగా వినాయక చవితి కోసం తీసుకువచ్చారు. మిగిలిన అలంకారం మొక్కలను వివిధ రాష్ట్రాల నుంచి, వాటిలో విదేశీ మొక్కలు కూడా ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.

సస్య గణపతి మొక్కల అలంకారంతోపాటు వాటర్ఫాల్, కొలను ఏర్పాటు చేసి అందులో చేపలు వేశారు. దీంతో పాటు పక్షులను కూడా ఆ ప్రాంతంలో ఉంచారు. ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సస్య గణపతి ద్వారా ప్రజలకు అందిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. పర్యావరణహిత ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ గణపతి భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. అక్టోబర్ 4వ తేదీ వరకు భక్తులకు సస్య గణపతి దర్శనమిస్తారు.