హిందూ మతంలో మొక్కలు, చెట్లను కూడా పూజిస్తారు. వీటిల్లో దేవుళ్లు నివసిస్తారని విశ్వసిస్తారు. వీటిని పూజిస్తే దేవుళ్ల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. పలు పండుగల సందర్భంగా ఒక్కో మొక్కను ఆరాధిస్తారు. మరి హిందూ మతంలో ఏయే మొక్కలు, చెట్లలో దేవుళ్లు నివసిస్తారో తెలుసుకుందాం.
ఉసిరి చెట్టులో లక్ష్మీ దేవి నివసిస్తుంది. కార్తీక, అశ్విని మాసాల్లో ఉసిరి చెట్టుకు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అలాగే మారేడు చెట్టులో శివుడు నివసిస్తాడని చెబుతారు. ఈ చెట్టు ఆకులు, కలపకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మారేడు చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.
అదే విధంగా అరటి చెట్టులో శ్రీ మహా విష్ణువు నివసిస్తాడని భక్తులు నమ్ముతారు. ఈ చెట్టుకు గురువారం పూజిస్తారు. దీపావళి పూజలో అరటి చెట్టును కూడా ఆరాధిస్తారు. సత్యనారాయణ పూజలో కూడా అరటి చెట్లు ఉండేలా చూస్తారు.
వేప చెట్టులో దుర్గాదేవి నివసిస్తుందని భావిస్తారు. దుర్గమ్మకు పూజ చేసే సమయంలో వేప చెట్టును కూడా పూజిస్తారు. భారత దేశంలోనే కాకుండా.. థాయిలాండ్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా వేపను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
ప్రతి రోజూ ఎంతో భక్తితో పూజించే తులసి మొక్కలో మహా విష్ణువు, లక్ష్మీ దేవి, శాలిగ్రామ్ స్వామి ఉంటారని భక్తులు నమ్ముతారు. అందుకే కార్తీక మాసంలో శివుడితో పాటు మహా విష్ణువుని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు.