
ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారబోతోందని తెలిపింది. దీంతో.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. మంగళవారం ఆయా జిల్లాల్లో తెలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతోపాటు.. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఏలూరు జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. దీంతోపాటు 40నుంచి 60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు చెట్లు, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని హెచ్చరించింది .

తెలంగాణ రాష్ట్రంలో కూడా.. చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని.. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ముఖ్యంగా.. పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేటలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితోపాటు.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.