
వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పొడి తిన్నా, లేదా ఇడ్లీ, దోశల్లోకి నంజుకుని తిన్నా అమృతతుల్యమైన రుచి లభిస్తుంది. ఈ కాకరకాయ కారం పొడి తయారీ కోసం ముందుగా పావు కేజీ కాకరకాయలను శుభ్రంగా కడిగి, సన్నటి గుండ్రటి చక్రాల్లా కట్ చేసుకోవాలి.

బాండీలో 5-6 స్పూన్ల నూనె వేడిచేసి, కట్ చేసిన కాకరకాయ ముక్కలను వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. మొదట హై ఫ్లేమ్పై, ఆ తర్వాత మీడియం నుండి లో ఫ్లేమ్పై సన్నటి మంటపై ఎర్రగా వేయించి పక్కన తీసుకోవాలి.

మిగిలిన నూనెలో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు, గుప్పెడు కరివేపాకు వేరువేరుగా వేయించి తీయాలి. ఆ తర్వాత టేబుల్ స్పూన్ నూనెలో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించాలి.

అందులోనే టేబుల్ స్పూన్ ధనియాలు, టీస్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, చిన్న నిమ్మకాయంత చింతపండు వేసి దోరగా వేయించి చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో వేయించిన శనగపప్పు-ధనియాల మిశ్రమం, సగం పల్లీలు, తగినంత ఉప్పు, పసుపు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

అందులో వేయించిన కాకరకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి 3-4 సార్లు పల్స్ ఇస్తూ కచ్చాపచ్చాగా తిప్పుకోవాలి. జార్లో ఒక వెల్లుల్లి గడ్డ పాయలు, మిగిలిన పల్లీలు వేసి కచ్చాపచ్చాగా తిప్పి, ఈ వెల్లుల్లి మిశ్రమం మరియు మిగిలిన కరివేపాకును కాకరకాయ పొడిలో వేసి బాగా కలుపుకోవాలి. తడి లేని బాటిల్లో పెడితే 2-3 నెలలు నిల్వ ఉంటుంది.