
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి భారత పర్యటనను విజయంతో ముగించాలని ఇంగ్లాండ్ ప్రయత్నిస్తుంటే.. 4-1తో సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. తొలి టెస్ట్ తప్పితే.. ఆ తర్వాత జరిగిన వరుస మూడు మ్యాచ్ల్లోనూ టీమిండియా విజయఢంకా మోగించి.. సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక ఈ ఐదో మ్యాచ్ ధర్మశాలలో జరగనుండగా.. దాదాపుగా ఎనిమిది మంది టీమిండియా ప్లేయర్లు అరంగేట్రం చేయనున్నారు. అదేంటని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ వార్తపై ఓ లుక్కేయండి మరి..

ధర్మశాలలో ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ జరిగింది. 2017 మార్చిలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ అది. దీని తర్వాత, దాదాపు ఏడేళ్లకు మళ్లీ ఇక్కడ మరో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈసారి టీమిండియా ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఒకసారి పరిశీలిస్తే.. దాన్ని ఇప్పటితో పోల్చితే.. ధర్మశాలలో జరిగే మ్యాచ్తో టీమిండియా తరపున 8 మంది ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నారు. 2017లో జరిగిన టెస్టు మ్యాచ్లో ఆడిన ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవన్లో ఉన్నారు. వారే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్.

కానీ మిగతా ఎనిమిది మంది ఆటగాళ్లు ఇంతకుముందు ధర్మశాలలో ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడలేదు, ఇందులో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి పేర్లు ఉన్నాయి. యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్, ఆకాష్దీప్, ధృవ్ జురెల్ కూడా ఈ లిస్టులో ఉన్నారు.

అయితే చివరి మ్యాచ్కు ప్లేయింగ్ ఎలెవన్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఆకాష్దీప్ స్థానంలో మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి రావచ్చు. అలా అయినా టీమిండియా తరపున ఎనిమిది మంది ఆటగాళ్లు ధర్మశాల మ్యాచ్లో అరంగేట్రం చేయనున్నారు.