
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో టెస్టుల్లో కెప్టెన్గా ఏడేళ్ల కోహ్లీ ప్రయాణం ముగిసింది. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా అనేక చారిత్రాత్మక విజయాలు అందుకోగా.. ఎంతోమంది యువ ప్లేయర్స్ కూడా తమ అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

అయితే, కోహ్లీ టెస్టుల్లో కెప్టెన్గా ఉన్నంత కాలం ఈ ముగ్గురు ప్లేయర్స్ మాత్రం తుది జట్టులో చోటు సంపాదించలేదు. వారెవరో కాదు మహేంద్ర సింగ్ ధోని, టి.నటరాజన్, నవదీప్ సైనీ.

2014 డిసెంబర్ 9న కోహ్లీకి తొలిసారిగా టెస్టు కెప్టెన్సీ లభించింది. ఆ సమయంలో టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అప్పటి టెస్ట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం కాగా.. అడిలైడ్ టెస్టులో విరాట్ కోహ్లీకి తొలిసారిగా కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.

ఆ తర్వాత రెండు టెస్ట్ మ్యాచ్లలో ధోని ఆడగా.. టీమిండియా ఒకదానిలో ఓడిపోయి.. మరో మ్యాచ్ను డ్రాగా ముగించింది. ఇక మెల్బోర్న్లో జరిగిన మూడో మ్యాచ్ అనంతరం ధోని టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ఇవ్వగా.. సెలెక్టర్లు కోహ్లీని టెస్ట్ కెప్టెన్గా నియమించారు.

2020-21 సంవత్సరంలో కూడా, టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. అప్పుడు విరాట్ కోహ్లీ మొదటి టెస్ట్ అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత తాత్కాలిక కెప్టెన్గా అజింక్య రహనే నియమితుడయ్యాడు. అతని నేతృత్వంలో నవదీప్ సైనీ, టి నటరాజన్లతో పాటు పలువురు యువ క్రికెటర్లు అరంగేట్రం చేశారు.. గానీ ఆ తర్వాత కోహ్లీ సారధ్యంలో మాత్రం మ్యాచ్ ఆడే ఛాన్స్ వీరిద్దరికీ దక్కలేదు.