
టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్పై టీమిండియా సాధించిన అద్భుత విజయం క్రికెట్ ప్రపంచంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ప్రదర్శించిన తెగువ, సమష్టి కృషి చివరకు విజేతగా నిలిచేలా చేశాయి. ముఖ్యంగా ఫైనల్ వంటి హై ప్రెజర్ మ్యాచ్లో ఒత్తిడిని అధిగమించి న్యూజిలాండ్ వంటి పటిష్టమైన జట్టును చిత్తుగా ఓడించడం భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరు ముగిసిన అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన భావోద్వేగాలను పంచుకుంటూ జట్టు విజయం వెనుక ఉన్న అసలు రహస్యాలను వెల్లడించారు. ఈ చారిత్రాత్మక విజయంపై సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ గెలుపు తాలూకు ఆనందం వర్ణించడానికి మాటలు లేవని గుర్తు చేసుకున్నారు. 2024 ప్రపంచకప్ ముగిసిన తర్వాత బీసీసీఐ, జై షా, రోహిత్ శర్మ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని ఈరోజు కప్పును ముద్దాడటం ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తోందని ఆయన వివరించారు.

ప్రపంచకప్ గెలవడం అంటే ఏమిటి, ఆ గెలుపు రుచి ఎలా ఉంటుందో కుర్రాళ్లకు వివరించానని, దానిని దృష్టిలో ఉంచుకొని ద్వైపాక్షిక సిరీస్ల నుంచి ఈ మెగా టోర్నీ వరకు ప్రతి ఆటగాడు బాధ్యతగా ఆడాడని కొనియాడారు. జట్టులోని ప్రతి ఒక్కరూ ఆ గెలుపు తాలూకు ఆకలిని అర్థం చేసుకొని ముందుకు సాగడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.

జట్టులోని కీలక ఆటగాళ్లైన సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిల సామర్థ్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందని సూర్య తెలిపారు. వీరంతా మ్యాచ్ విన్నర్లని తనకు తెలుసని, సరైన సమయంలో సంజు రాణించడం, ప్రపంచ స్థాయి ఆటగాళ్లైన వరుణ్, అభిషేక్ తమ ముద్ర వేయడం అద్భుతమని అభినందించారు. అలాగే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి సీనియర్ ఆటగాళ్లు చాలా కాలంగా జట్టులో ఉంటూ సహాయక సిబ్బందితో కలిసి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ రావటం ఈ విజయానికి ప్రధాన కారణమని సూర్య పేర్కొన్నారు.

ముఖ్యంగా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి సూర్య ఆకాశానికి ఎత్తేశారు. బుమ్రా ఒక తరానికి ఒక్కడు మాత్రమే పుట్టే అరుదైన బౌలర్ అని, అతన్ని దేశపు నిధిగా భావించవచ్చని సూర్య కొనియాడారు. మైదానంలో ఏం చేయాలి, ఎప్పుడు ఎలా బౌలింగ్ చేయాలి అనే విషయంలో బుమ్రాకు స్పష్టమైన అవగాహన ఉంటుందని, ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ వ్యాపారంలో అతనే అత్యుత్తమ ఆటగాడని ప్రశంసించారు. గత మ్యాచ్లో సంజూ శాంసన్ తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బుమ్రాకు ఇవ్వాలనుకోవడమే అతడి ప్రాధాన్యతను తెలియజేస్తుంది. భవిష్యత్తులో కూడా బుమ్రా ఇలాగే భారత్కు విజయాలను అందించాలని, ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే ఎన్ని ప్రపంచకప్పులైనా గెలవవచ్చని సూర్యకుమార్ యాదవ్ తన ప్రసంగాన్ని ముగించారు.