
ఆసియా కప్ సూపర్ 4 క్లాష్లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 2 వికెట్లు తీసిన టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భారీ రికార్డును బద్దలు కొట్టాడు. టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉన్న 2012 నాటి రికార్డును జడేజా బ్రేక్ చేశాడు.

ఈ మ్యాచ్లో ధనంజయ డి సిల్వా, దసున్ షనక వికెట్లను తీసిన జడేజా.. ఆసియా కప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అవతరించాడు. అయితే ఈ మ్యాచ్కి ముందు ఈ స్థానంలో ఇర్ఫాన్ పఠాన్ ఉండేవాడు.

2004, 2008, 2012 ఆసియా కప్ టోర్నీలో భారత్ తరఫున 12 మ్యాచ్లు ఆడిన ఇర్ఫాన్ మొత్తం 22 వికెట్లు తీశాడు. మరోవైపు ఆసియా కప్లో 18 మ్యాచ్లు ఆడిన జడేజా 24 వికెట్లు పడగొట్టాడు.

తద్వారా ఆసియా కప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఇర్ఫాన్ స్థానాన్ని జడేజా తన సొంతం చేసుకున్నాడు. అలాగే ఇర్ఫాన్ ఇప్పుడు రెండో స్థానంలోకి దిగాడు.

కాగా, భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 లిస్టులో కుల్దీప్ (19), సచిన్ టెండూల్కర్ (17), కపిల్ దేవ్ (15) వరుసగా 3,4,5 స్థానాల్లో ఉన్నారు.