
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు అతిపెద్ద క్రికెట్ లీగ్లో భాగం కావాలని కోరుకుంటుండగా, మరోవైపు ఇంగ్లండ్ టీ20 స్పెషలిస్ట్గా పేరుగాంచిన సామ్ బిల్లింగ్స్ మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్ 2023లో ఆడనని సామ్ బిల్లింగ్స్ సోమవారం ప్రకటించాడు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ టీంకు బ్యాడ్ న్యూస్లా మారింది.

ఐపీఎల్ రిటెన్షన్ చివరి తేదీకి ముందు సామ్ బిల్లింగ్స్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్లో ఈ విషయాన్ని ప్రకటించాడు. 'నేను తదుపరి ఐపీఎల్లో పాల్గొనకూడదని కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. టెస్ట్ ఫార్మాట్పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన కోల్కతా నైట్ రైడర్స్కు ధన్యవాదాలు. నేను ప్రతి క్షణం ప్రేమించాను. ఈ ఫ్రాంచైజీ అద్భుతమైనది. భవిష్యత్తులో మళ్లీ కలుస్తానని ఆశిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.

సామ్ బిల్లింగ్స్ను కోల్కతా గత సీజన్లో రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ కుడిచేతి వాటం వికెట్ కీపర్-బ్యాట్స్మన్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. బిల్లింగ్స్ కేవలం 24.14 సగటుతో 169 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి ఒక్క అర్ధ సెంచరీ కూడా రాలేదు. బిల్లింగ్స్ KKR కోసం మొత్తం 8 మ్యాచ్లు ఆడాడు. 122.46 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 36 పరుగులే కావడం గమనార్హం.

కోల్కతా నైట్ రైడర్స్ ఆరోన్ ఫించ్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, రమేష్ కుమార్, అజింక్యా రహానెలను ఐపీఎల్ రిటెన్షన్కు ముందే విడుదల చేయనుందని వార్తలు వినిపిస్తు్న్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ శ్రేయాస్ అయ్యర్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, పాట్ కమిన్స్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఉమేష్ యాదవ్, షెల్డన్ జాక్సన్లను ఉంచుకోవచ్చని తెలుస్తోంది.

మినీ వేలానికి ముందే ఆటగాళ్ల ట్రేడింగ్ సాగుతోంది. KKR టీం గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న కివీస్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ను ట్రేడింగ్లో తమ జట్టులో భాగంగా చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ తరపున లాకీ ఫెర్గూసన్ గత సీజన్లో 13 మ్యాచ్లలో 12 వికెట్లు పడగొట్టాడు.