
Rishabh Pant Breaks MS Dhoni Record: శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్ట్ తొలి రోజున టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ మణికట్టు గాయంంతో బాధపడుతూ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పంత్.. 63 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో తన గురువు ఎంఎస్ ధోని రికార్డ్నే బద్దలు కొట్టాడు. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..

ఆల్రౌండర్ సారాంశ్ జైన్ ఔటైన తర్వాత అతను 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 81 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు రిషబ్ పంత్. మొత్తంగా 88 బంతులు ఆడిన పంత్.. 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పంత్ విదేశీ టెస్ట్ల్లో భారత జట్టు తరపున వికెట్ కీపర్ కం బ్యాటర్గా 2500 పరుగులు పూర్తి చేసి, విదేశీ టెస్ట్ మ్యాచ్ల్లో ధోని నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డ్ను బద్దలు కొట్టాడు.

విదేశీ టెస్ట్ల్లో ఒక భారత బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు చేసిన ధోని రికార్డ్ను పంత్ బ్రేక్ చేయడం గమనార్హం. కాగా, ధోని తన కెరీర్లో 48 విదేశీ టెస్ట్ల్లో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలతో సహా 32.84 సగటుతో 2496 పరుగులు సాధించాడు. మరోవైపు పంత్ భారత జట్టు తరపున 36 విదేశీ టెస్ట్ల్లో 6 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో సహా 42కు పైగా సగటుతో 2534 పరుగులు సాధించాడు.

రిషబ్ పంత్ గత కొన్నేళ్లుగా భారత జట్టు తరపున అత్యంత నిలకడైన టెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో దిగ్గజ ఆటగాళ్ల సరసన తన పేరును లిఖించుకున్నాడు. కాగా, ఇప్పటికే పంత్ ఎన్నో విదేశీ టెస్ట్ల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి, జట్టు విజయానికి దోహదపడిన సంగతి తెలిసిందే. మొత్తంగా భారత జట్టు తరపున 52 టెస్ట్ల్లో 43కి పైగా సగటుతో 3725 పరుగులు సాధఇంచాడు. ఇందులో 8 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

అయితే, ఈ లిస్ట్లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ విదేశీ టెస్ట్ల్లో వికెట్ కీపర్ కం బ్యాటర్గా 52 టెస్ట్ల్లో 35కుపైగా సగటుతో 2696 పరుగులతో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. కాగా, పంత్ మరో 162 పరుగులు చేస్తే, పాక్ మాజీ ప్లేయర్ రికార్డ్ను బ్రేక్ చేసి అగ్రస్థానంలో చేరుకుంటాడు.