
భారత్, శ్రీలంక మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా 10000 వన్డే పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ అవతరించాడు.

అంతేకాక లంకపై కొట్టిన రెండు సిక్సర్ల ద్వారా కూడా ఆసియా కప్ టోర్నీలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అగ్రస్థానాన్ని రోహిత్ అధిరోహించాడు. ఇందుకోసం షాహిద్ అఫ్రిదీ సిక్సర్ల లెక్కను కూడా హిట్ మ్యాన్ అధిగమించాడు.

ఈ మ్యాచ్ జరగకముందు పాక్ మాజీ షాహిద్ అఫ్రిదీ 26 సిక్సర్లతో ఆసియా కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఉండేవాడు. అయితే లంకపై కొట్టిన రెండు సిక్సర్లతో ఆ స్థానాన్ని రోహిత్ సొంతం చేసుకున్నాడు.

ఆసియా కప్లో ఇప్పటివరకు 26 మ్యాచ్లు ఆడిన రోహిత్ 28 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. 23 మ్యాచ్ల్లో 26 సిక్సర్లు బాదిన అఫ్రిదీ రెండో స్థానంలో ఉన్నాడు.

అలాగే ఈ లిస్టు మూడో స్థానంలో శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య ఉన్నాడు. ఆసియా కప్లో జయసూర్య 25 మ్యాచ్లు ఆడి 23 సిక్సర్లు బాదడం ద్వారా ఈ రికార్డును కలిగి ఉన్నాడు.