భారత్-పాకిస్థాన్ టీంల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021లో కూడా ముఖాముఖిగా తలపడ్డాయి. మొత్తం క్రికెట్ ప్రపంచం దృష్టి ఈ మ్యాచ్పై పడింది. పాకిస్తాన్ టీం ప్రపంచకప్లో తొలిసారిగా భారత్ను ఓడించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత, కొన్ని వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటలను మాత్రం ఎంతో నిరాశను కలిగించాయి. అవేంటో తెలుసుకుందాం.
ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. దీని తర్వాత, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అభిమానుల టార్గెట్లోకి వచ్చాడు. షమీ తన మతం కారణంగా పాకిస్థాన్కు మద్దతుదారుడని ఆరోపించారు. షమీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో షమీని పాకిస్థానీ అని.. అతను అమ్ముడుపోయాడని ట్రోల్స్ చేశారు. షమీకి వ్యతిరేకంగా చాలా అసభ్యకరమైన కామెంట్లు పోస్టు చేశారు. అయితే చాలా మంది మాజీలు షమీకి మద్దతుగా నిలిచారు.
ఈ విజయం పాకిస్తాన్కు చారిత్రాత్మకమైనది. అయితే పాకిస్తాన్కు చెందిన రక్షణ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఈ విజయాన్ని ఇస్లాం విజయంగా పేర్కొన్నాడు. ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. "ఈ రోజు మా ఫైనల్. ప్రపంచ ముస్లింలతో పాటు, భారతదేశ ముస్లింల భావాలు కూడా పాకిస్తాన్ జట్టుతోనే ఉన్నాయి. ఇస్లాంలందరికీ శుభాకాంక్షలు" అంటూ చిచ్చు రేపాడు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ కూడా అలాంటి ప్రకటనే చేసి బహిరంగ విమర్శలకు గురయ్యాడు. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ డ్రింక్స్ విరామ సమయంలో నమాజ్ చేసి ఈ మ్యాచ్లో మరో వివాదానికి తెర తీశాడు. "రిజ్వాన్లో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, అతను నేలపై నిలబడి నమాజ్ చేయడం, అది కూడా హిందువుల మధ్యలో చేయడం.. నాకు చాలా ప్రత్యేకమైనది." అంటూ చెప్పి మరింత ఆజ్యం పోశాడు. ఈ ప్రకటన తెరపైకి రావడంతో వకార్పై దాడులు మొదలయ్యాయి. ఇప్పుడు దీనిపై ట్వీట్ చేస్తూ క్షమాపణలు కూడా తెలిపాడు.
ఈ మ్యాచ్ తర్వాత, భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ అమీర్ కూడా ట్విట్టర్లో గొడవ పడ్డారు. షాహిద్ అఫ్రిది తన బంతులను తీవ్రంగా కొట్టిన మ్యాచ్ను హర్భజన్కు అమీర్ గుర్తు చేశాడు. దీని తర్వాత హర్భజన్ ఇంగ్లండ్ లార్డ్ అమీర్ చేసిన నోబాల్ను ఫిక్సింగ్గా అమీర్కు గుర్తు చేశాడు.