ఎప్పటిలాగే మరోసారి పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆశ్చర్యపరిచింది. అందరి అంచనాలను తలక్రిందులు చేసి టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో అద్భుతంగా రాణిస్తోంది. సూపర్ 12 లీగ్ మొదటి మ్యాచ్లో టీమిండియాను ఓడించడం దగ్గర నుంచి చివరి మ్యాచ్ వరకు పాకిస్థాన్ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీ20 ప్రపంచకప్ 2021 టోర్నమెంట్లో బాబర్ అజామ్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ జట్టు అన్ని మ్యాచ్లను గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. ఇక ట్రోఫీ కోసం పోటీపడే జట్లకు పాకిస్తాన్ గట్టి పోటీని ఇవ్వనుంది. ఇక పాకిస్తాన్ విజయాల్లో 5 ఆటగాళ్లు కీలకం వారెవరంటే..
షాహీన్ అఫ్రిది: టీమిండియాపై చారిత్రాత్మక విజయాన్ని అందుకోవడంలో షాహీన్ అఫ్రిది కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో షాహీన్ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. అంతేకాకుండా మిగిలిన మ్యాచ్ల్లో తన వంతు పాత్రను పోషిస్తూ వచ్చాడు.
హరీస్ రవూఫ్: న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ అద్భుత విజయం నమోదు చేసుకోవడానికి ప్రధాన కారణం హరీస్ రవూఫ్. ఇతగాడు వేసిన సూపర్ స్పెల్తో.. కివీస్ బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. ఆ మ్యాచ్లో 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 4 వికెట్ల తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ఆసిఫ్ అలీ: ఆఫ్గనిస్తాన్తో జరిగిన మూడో మ్యాచ్ పాకిస్థాన్కు ఓటమి అంచుల్లోకి ఉండగా.. 19 ఓవర్లో ఆసిఫ్ అలీ 4 సిక్సర్లు కొట్టి విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్లో కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులు చేసిన ఆసిఫ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అలాగే మిగిలిన మ్యాచ్ల్లో కూడా ఆసిఫ్ చివర్లో తన వంతు సహకారాన్ని అందిస్తున్నాడు.
ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్.. నమిబీయా మ్యాచ్లో కేవలం 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అలాగే టీమిండియా మ్యాచ్లోనూ బాబర్ అజామ్తో అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పాకిస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
చివరిగా కెప్టెన్ బాబర్ అజామ్.. కూల్ కెప్టెన్సీ చేయడమే కాకుండా.. జట్టుకు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అవసరమైనప్పుడు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును ముందుంది నడిపిస్తున్నాడు.