ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 తుది అంకానికి చేరుకుంది. చివరి లీగ్ మ్యాచ్లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.
ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే RCB ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి. కానీ మ్యాచ్ ప్రారంభానికి కోహ్లీ టీమ్కు భారీ షాక్ తగిలింది. టీమ్ స్టార్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ నేటి మ్యాచ్తో సహా ఐపీఎల్కు దూరమయ్యాడు.
హేజిల్వుడ్ ప్రస్తుతం మడమ నొప్పితో బాధపడుతున్నాడు. అతను ఈరోజు లేదా రేపు స్వదేశానికి వెళ్లవచ్చు. హేజిల్వుడ్ వికెట్ టేకింగ్ బౌలర్ కావడం, అందులోనూ లీగ్ చివరి దశలో తప్పుకోవడంతో బెంగళూరుకు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు.
IPL 2023 టోర్నమెంట్ ప్రారంభానికి ముందే జోష్ గాయపడ్డాడు. భారత్తో జరిగే టెస్టు సిరీస్కు కూడా అతను దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్ ఆరంభ మ్యాచుల్లోనూ జోష్ ఆడలేదు.
8 మ్యాచ్ల తర్వాత కానీ మైదానంలోకి అడుగుపెట్టలేదు జోష్. మళ్లీ ఇప్పుడు గాయంతోనే టోర్నీకి దూరమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఈరోజు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇది RCBకి డూ-ఆర్ డై మ్యాచ్.