
India vs Bangladesh T20i series: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతోంది. సిరీస్లోని తొలి మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది.

నివేదికల ప్రకారం, బంగ్లాదేశ్ సీనియర్ ఆల్ రౌండర్ మహ్మదుల్లా భారత్తో జరుగుతున్న సిరీస్ ముగిసిన తర్వాత టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్ కాబోతున్నాడు. షకీబ్ అల్ హసన్ లాగానే మహ్మదుల్లా కూడా టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. BCB అధికారి డైలీ స్టార్తో మాట్లాడుతూ, 'ఇది విరామం కాదు, టీ20 అంతర్జాతీయ కెరీర్ను ముగించాలని కోరుకుంటున్నాడు. ఈ సిరీస్లో ప్రకటిస్తాడు. నివేదిక ప్రకారం, అతను సిరీస్కు ముందే ఈ ఫార్మాట్ను విడిచిపెట్టాలని తన కోరికను వ్యక్తం చేశాడు' అని తెలిపాడు.

సిరీస్కు ముందు, కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో మహ్మదుల్లా తన భవిష్యత్తు గురించి సెలెక్టర్లతో మాట్లాడతాడని సూచించాడు. తొలి టీ20 మ్యాచ్కు ముందు శాంటో మాట్లాడుతూ, 'మహ్మదుల్లా భాయ్ గురించి, ఈ సిరీస్ అతనికి చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. అతను సెలెక్టర్లతో చర్చించవచ్చు. దీనిపై నాకు పూర్తి స్పష్టత లేదు, అయితే సెలెక్టర్లు, బోర్డుతో అతని భవిష్యత్తు గురించి ఖచ్చితంగా చర్చ జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఈ సిరీస్లోని చివరి మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్లో జరుగుతుంది. ఇది ఈ ఫార్మాట్లో మహ్మదుల్లాకు చివరి మ్యాచ్ కూడా కావచ్చు అని తెలిపాడు.

38 ఏళ్ల మహ్మదుల్లా బంగ్లాదేశ్ జట్టు తరపున ఇప్పటివరకు 139 టీ20 మ్యాచ్లు ఆడాడు. 2007లో బంగ్లాదేశ్ తరపున తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ సమయంలో, అతను 117.74 స్ట్రైక్ రేట్తో 2395 పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ 40 వికెట్లు తీశాడు. అతను 2021లో టెస్టు నుంచి రిటైర్ అయ్యాడు. అయినప్పటికీ, అతను బంగ్లాదేశ్ తరపున వన్డేల్లో ఆడటం కొనసాగిస్తున్నాడు. మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరపున 50 టెస్టులు ఆడాడు. అదే సమయంలో, అతను ఇప్పటివరకు 232 వన్డే మ్యాచ్లు కూడా ఆడాడు.

ఓ స్టార్ ప్లేయర్ తన T20 కెరీర్ను ఈ సిరీస్తో ముగించనున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, ఈ సిరీస్ మధ్యలో ఈ ఆటగాడు టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంట.