ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ తొలి ఎడిషన్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి టైటిల్ గెలవలేకపోయిన టీమిండియా.. ఇప్పుడు వరుసగా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే, టీమిండియా ఈ ప్రయాణం అంత ఈజీగా రాలేదు. పలు బలమైన జట్లను ఓడించిన రోహిత్ జట్టు మరోసారి టైటిల్ రౌండ్లోకి ప్రవేశించింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండో ఎడిషన్లో, భారత జట్టు మొత్తం 6 టెస్ట్ సిరీస్లు ఆడింది. ఇందులో ఒక సిరీస్ను మాత్రమే కోల్పోగా, మరో సిరీస్ డ్రాగా ముగిసింది. నాలుగు సిరీస్లను టీమిండియా కైవసం చేసుకుంది.
ఈ ఎడిషన్లో భారత జట్టు మొత్తం 18 మ్యాచ్లు ఆడింది. ఈ 18 మ్యాచ్ల్లో 10 గెలిచిన భారత్ 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. మిగిలిన 3 టెస్టు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో టీమిండియా ప్రయాణం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూజిలాండ్తో జరిగిన మొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత, అంటే ఆగస్టు 2021లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్లో పర్యటించింది. ఇరు జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ జరగాల్సి ఉంది. కానీ, అక్కడ కేవలం 4 టెస్టులు మాత్రమే జరిగాయి. సిరీస్లోని 5వ, చివరి టెస్టు జులై 2022కి వాయిదా పడింది. చివరకు ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ 2-2తో సమమైంది.
ఆ తర్వాత డిసెంబర్ 2021లో న్యూజిలాండ్తో టీమ్ ఇండియా స్వదేశంలో 2 మ్యాచ్లు ఆడి 1-0తో సిరీస్ని కైవసం చేసుకుంది. టీమిండియా డిసెంబర్ 2021, జనవరి 2022 మధ్య దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఆతిథ్య జట్టుతో జరిగిన 3-మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయింది.
భారత్ మార్చి 2022లో శ్రీలంకతో స్వదేశంలో 2-టెస్టుల సిరీస్ని ఆడింది. సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది. 2022 డిసెంబర్లో బంగ్లాదేశ్లో పర్యటించిన భారత్, రెండు టెస్టుల సిరీస్ను 2-0తో గెలుచుకుంది. ఫిబ్రవరి-మార్చి 2023లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో 4-టెస్టుల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ను ఆడింది.ఈ సిరీస్ను 2-1తో గెలుచుకుంది.