
ఎలక్ట్రోలైట్ల గని కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలో సహజంగానే ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి మూలకాలు శరీరంలో ద్రవాలను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల తాగిన వెంటనే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

వడదెబ్బ నుంచి రక్షణ: ఎండలో తిరిగే వారికి, అధికంగా చెమట పట్టే వారికి ఎలక్ట్రోలైట్ మద్దతు ఇవ్వడంలో కొబ్బరి నీళ్లు మేటి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి కూడా తక్కువ కేలరీల పానీయంగా ఉపయోగపడతాయి.

విటమిన్ సి నిధి నిమ్మరసం: మన దేశంలో అత్యంత చౌకగా, సులభంగా లభించే పానీయం నిమ్మరసం. ఇది కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా చర్మానికి, రోగనిరోధక శక్తికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎండ వేడిమి వల్ల పాడయ్యే చర్మాన్ని కాపాడుతుంది. నిమ్మకాయకు ఉండే క్షార గుణం వల్ల శరీరంలోని pH స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

ఏది ఎప్పుడు తాగాలి?: డైటీషియన్ గీతికా చోప్రా ప్రకారం.. ఈ రెండూ వాటి వాటి రీతుల్లో శరీరానికి మేలు చేస్తాయి. అయితే తీవ్రమైన ఎండ, నీరసం ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు ఉత్తమం. ఎందుకంటే ఇది కోల్పోయిన ఖనిజాలను వేగంగా భర్తీ చేస్తుంది. రోజూవారీ హైడ్రేషన్ కోసం నిమ్మరసం తక్కువ ఖర్చుతో కూడిన బెస్ట్ ఆప్షన్. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు. మధ్యాహ్నం వేళల్లో డిటాక్స్ పానీయాలుగా కూడా వీటిని వాడవచ్చు.

నిపుణుల సలహా: కేవలం ఏదో ఒకటి మాత్రమే కాకుండా ఈ రెండింటిని మార్చి మార్చి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందుతాయని డాక్టర్ గీతిక సూచిస్తున్నారు. వీటితో పాటు పుదీనా నీళ్లు, సబ్జా గింజల పానీయాలను కూడా చేర్చుకుంటే వేసవి వడదెబ్బ నుంచి శరీరాన్ని పూర్తిస్థాయిలో రక్షించుకోవచ్చు.