చెన్నైలోని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోలీవుడ్కు చెందిన నలుగురు టాప్ హీరోలకు రెడ్ కార్డ్లు జారీ చేసింది. చెన్నైలో జరిగిన నిర్మాతల మండలి కార్యవర్గ సమావేశం కౌన్సిల్ సభ్యుల ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకున్న ఈ నిర్ణయం మేరకు తమిళ నటులు ధనుష్, శింబు, విశాల్, అథర్వలకు రెడ్ కార్డులు జారీ చేశారు. దీంతో తమిళ సినీ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. వీరిపై పలుమార్లు వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా రెడ్కార్డు వేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
సినీ నిర్మాతలకు సహకరించకుండా, వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హీరో శింబు ‘అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్’ (ఏఏఏ) మువీ షూటింగ్ సమయంలో 60 రోజులు పనిచేస్తానన్న తన నిబంధనను అతిక్రమించాడని, సరైన సమయానికి చిత్రీకరణకు రాకపోవడం లాంటి పలు సమస్యల వల్ల తనకు నష్టం వాటిల్లిందని ఈ సినిమా నిర్మాత మైఖేల్ రాయప్పన్ మండలిలో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి శింబుకి రెడ్ కార్డు జారీ చేసింది.
ప్రస్తుత నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి రామస్వామి నిర్మాణంలో ధనుష్ హీరోగా చిత్రీకరిస్తోన్న ఓ మువీ షూటింగ్కు ధనుష్ కొన్ని కారణాల వల్ల హాజరుకాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. అందువల్ల ధనుష్పై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.
నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు విశాల్ తన హయాంలో మండలి నిధులు పక్కదోవ పట్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందుకే విశాల్కు రెడ్ కార్డు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మథియాజ్కజన్ వివాదం మూలంగా అథర్వకు రెడ్ కార్డు జారీ చేశారు. తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC) జూన్ 2023లో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖులైన శింబు, విశాల్, SJ సూర్య, అథర్వ, యోగి బాబుతో సహా పలువురు నటులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
రెడ్ కార్డ్ అంటే.. రెడ్ కార్డు జారీ చేసిన నటీనటులు తదుపరి నోటీసు వచ్చే వరకు కోలీవుడ్ నిర్మాతలతో కలిసి పనిచేయకుండా తాత్కాలికంగా నిషేధం విధించడం. కొత్త సినిమా ప్రాజెక్ట్లను తీసుకునే ముందు నటీనటులు నిర్మాతలతో ఉన్న తమ వివాదాలను పరిష్కరించుకోవల్సి ఉంటుంది. ఇక రెడ్ కార్డ్ సమస్యపై ఈ నలుగురు హీరోలు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. విశాల్ తాజా మువీ 'మార్క్ ఆంటోని' విడుదలకు సిద్ధంగా ఉంది. ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.