
మైనస్ మైనస్ ప్లస్ అవుతుందని చిన్నపుడు స్కూల్లో చదువుకున్నాం కదా..! ఇప్పుడలాంటి క్రేజీ కాంబినేషన్ ఒకటి టాలీవుడ్లో వస్తుంది. అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు.

అలాగని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే వాళ్ల ట్రాక్ రికార్డ్ అలా ఉంది. కానీ ఈ సినిమా అందరి కెరీర్స్కు కీలకంగా మారింది. ఇంతకీ అంత ఆసక్తి రేపుతున్న ఆ సినిమా ఏంటో తెలుసా..?

మనమే.. ఇన్నాళ్లూ ఈ సినిమా గురించి అస్సలు సౌండ్ లేదు. ఎలాంటి సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేసారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

చడీ చప్పుడు లేకుండా జూన్ 7న విడుదల తేదీ ఖరారు చేసుకుంది మనమే. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్లో జోరు పెంచేసారు మేకర్స్. కొన్నేళ్లుగా శర్వానంద్ కెరీర్కు బ్లాక్బస్టర్ లేదు. పైగా 2022లో ఒకే ఒక జీవితం సినిమాతో వచ్చిన శర్వా..

లాంగ్ గ్యాప్ తీసుకుని మనమే అంటూ వస్తున్నారు. ఒకే ఒక జీవితం ఓకే అనిపించింది కానీ బ్లాక్బస్టర్ అయితే కాదు. ఇక కృతి శెట్టికి కూడా బంగార్రాజు తర్వాత వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్, మాచెర్ల నియోజకవర్గం, కస్టడీ ఫ్లాపయ్యాయి.

మనమే సక్సెస్ ఇటు శర్వా.. అటు కృతి కెరీర్స్కు కీలకంగా మారింది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య పరిస్థితి కూడా అంతే. సరైన బ్లాక్బస్టర్ కోసం 9 ఏళ్ళుగా వేచి చూస్తున్నారు ఈ దర్శకుడు.

భలే మంచి రోజు, దేవదాస్ లాంటి సినిమాలతో ఓకే అనిపించినా.. సక్సెస్ అందుకోలేదు శ్రీరామ్ ఆదిత్య. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి హిట్టొచ్చి చాలా కాలమైంది. అందుకే అందరికీ మనమే సినిమా కీలకం కానుంది.