
నటసార్వభౌముడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు.. పలు ప్రాంతాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ మే 20 సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్, కూకట్పల్లి, హౌసింగ్ బోర్డులోగల కైతలాపూర్ మైదానంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఎన్టీఆర్పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు సావనీర్, ‘జయహో ఎన్టీఆర్’ వెబ్సైట్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అతిధులుగా ఎన్.టి.రామారావు కుటుంబ సభ్యులందరినీ కమిటీ ఆహ్వానించింది.

ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ సహకారంతో ఈ రోజు కమిటీ చైర్మన్ టి.డి.జనార్థన్, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరీ దంపతులను ఆహ్వానించారు.

ఎన్టీఆర్ సావనీర్ కమిటీ చైర్మన్ టి.డి.జనార్థన్.. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్రామ్ ను కలిసి ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించారు.

నందమూరి జయకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, గారపాటి లోకేశ్వరి, కంఠంనేని ఉమాశ్రీనివాస్ ప్రసాద్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, కాట్రగడ్డ రుక్మాంగదరావు (ఎన్టీఆర్ బావమరిది)ని ఆహ్వానించారు.

ఇంకా ఇతర కుటుంబ సభ్యులను కూడా కలిసి ఆహ్వాన పత్రాలు అందించి వారందరూ తమ కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చేయాలని ఆహ్వానించినట్లు జనార్ధన తెలిపారు.