
సౌత్ సినిమాలు జనాలకు దూరంగా ఉన్న రోజులు పోయాయి. ఇప్పుడు డబ్బింగ్ అయి అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. సౌత్ మూవీస్ని ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా అందరూ చూసేస్తున్నారు అన్నారు హీరోయిన్ రాశీఖన్నా.

అందుకే అక్కడి కంటెంట్ని ఇక్కడ రీమేక్ చేస్తే.. ఆ సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఈ విషయాన్ని బాలీవుడ్ మేకర్స్ అర్థం చేసుకోవాల్సిన టైమ్ వచ్చేసిందని అంటున్నారు టాలీవుడ్ బాబ్లీ బ్యూటీ.

డిజిటల్లోనూ ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టు చేస్తూనే ఉంటారు రాశీ ఖన్నా. ఓటీటీ వచ్చాక జనాలకు విస్తృతమైన కంటెంట్ అందుబాటులో ఉంటోంది. నట్టింట్లో అంత వెరైటీ సబ్జెక్టులు అలరిస్తున్నప్పుడు థియేటర్ల వరకూ జనాలను రప్పించాలంటే లార్జర్ దేన్ లైఫ్ కథలతోనే ముందుకెళ్లాలన్నది ఈ బ్యూటీ స్టేట్మెంట్.

రాశీఖన్నా నటించిన అగత్య ఇటీవల రిలీజ్ అయింది. హారర్ థ్రిల్లర్ ఫాంటసీ సబ్జెక్ట్ ఇది. ఈ తరహా సినిమాల్లో నటించడం అంత తేలికైన పని కాదంటున్నారు రాశీ. వాటిలో నటించడానికి మానసికంగా ప్రిపేర్ కావడానికి చాలా సమయం పడుతుందన్నది ఈ లేడీ అభిప్రాయం. అంతే కాదు, సీన్ కంప్లీట్ చేశాక అందులోనుంచి బయటకు రావడం కూడా పెద్ద ఎక్సర్సైజ్ అంటున్నారు.

తెలుగుకు రాశీ దూరమవుతున్నారన్నది రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా వినిపిస్తున్న మాట. అయితే అలాంటిదేమీ లేదన్నది రాశీ ఇస్తున్న క్లారిటీ. భావోద్వేగాలు ఎక్కడైనా ఒకటేనని, మంచి సబ్జెక్టుల్లో భాగం కావడానికి తానెప్పుడూ రెడీగా ఉన్నానని చెబుతున్నారు రాశీ.