
యాత్ర 2లో జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నాడు. తాజాగా టీజర్ కూడా విడుదల చేసారు. అందులో సెటైర్లు బాగానే ఉన్నాయి. యాత్ర సినిమాను కేవలం రాజశేఖర్ రెడ్డి ఛరిష్మా చుట్టూ అల్లుకున్న మహి.. యాత్ర 2ను మాత్రం చాలా సెటైరికల్గా తీసినట్లు టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఇతర పార్టీలతో పాటు పాత్రలపై కూడా పొలిటికల్ పంచులు బాగానే పడ్డాయి.

చంద్రబాబు నాయుడు పాత్రను కాస్త నెగిటివ్గానే చూపించారని యాత్ర 2 టీజర్ చూస్తుంటే క్లారిటీ వచ్చేస్తుంది. మరోవైపు టీజర్ చివర్లో నేను నా శత్రువును ఓడించాలనుకుంటాను కానీ.. మీ నాయకుడిగా వాడు నాశనం అయిపోవాలని కోరుకోను అనే డైలాగ్ కూడా అగ్గి రాజేస్తుంది. యాత్ర ప్యూర్ ఎమోషనల్ ఎంటర్టైనర్గానే సాగిపోయింది. ఆ సినిమాలో ఇతర పార్టీలపై కానీ.. కారెక్టర్లపై కానీ పంచులు ఉండవు.

కేవలం రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులు, ఆయన పాదయాత్రపైనే ఫోకస్ చేసాడు మహి వి రాఘవ్. కానీ సీక్వెల్ అలా కాదు.. జగన్ పాదయాత్రతో పాటు కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన పడిన ఇబ్బందులు కూడా చూపించాడు. జైలు జీవితాన్ని హైలైట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇలా ఉంటే యాత్ర 2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఆ మరుసటి రోజు ఈగల్తో పాటు ఊరిపేరు భైరవకోన సినిమాలు విడుదల కానున్నాయి.

అయితే ఇప్పుడు యాత్ర 2కు పోటీగా మరో సినిమా కూడా వచ్చేస్తుంది.. అది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న సబ్జెక్ట్ కావడం గమనార్హం. పదేళ్ల కింద పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను ఫిబ్రవరి 8న యాత్ర 2కు పోటీగా రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కచ్చితంగా యాత్ర 2కు రాంబాబు పోటీ ఇస్తాడని నమ్ముతున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా పొలిటికల్ సీజన్ కాబట్టి ఒక్కో పార్టీ ఒక్కో సినిమాను భుజాన వేసుకుని మరీ మోస్తుంది.. మోయడం ఖాయం. అందుకే తెలుగుదేశంతో కలిసి నడుస్తున్న పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబును యాత్ర 2కు పోటీగా దించేస్తున్నారు. మరి ఈ పోటీ ఎలా ఉండబోతుందో చూడాలిక.