గతేడాది అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వర్కవుట్స్ చేస్తున్న సమయంలోనే అప్పు గుండెపోటుకు గురికావడం... ఆ తర్వాత ఆసుప్రతిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఆ విషాదం నుంచి అభిమానులు కోలుకోలేదు.
ఇప్పటికీ పునీత్ జ్ఞాపకాలను.. అరుదైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇప్పటికీ పునీత్ చేసిన సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకుంటున్నారు.
తాజాగా పునీత్ స్మారకార్థం ఓ ఉపగ్రహాన్ని తయారు చేసేందుకు శ్రీకారం చుట్టారు. పునీత్ పేరిట శాటిలైట్ను రూపొందించనున్నట్లు కర్ణాటక రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ ప్రకటించారు.
బెంగుళూరులోని ప్రముఖ పీయూ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉపగ్రహ తయారీ కోసం ప్రభుత్వం తరుపున రూ. 1.90 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
బెంగుళూరుకు చెందిన విద్యార్థుల ద్వారానే విగ్రహన్ని తయారు చేస్తామని తెలిపారు. సాధారణంగా 50 కిలోల శాటిలైట్ ను రూపొందించేందుకు రూ. 50 నుంచి 60 కోట్లు ఖర్చు అవుతుంది తెలిపారు.
కిలో బరువున్న శాటిలైట్ ను విద్యార్థులు రూ. 1.90 కోట్లతో రూపొందిస్తారని చెప్పారు. 20 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవుతారని చెప్పారు.