
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గురించి చెప్పక్కర్లేదు. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు బాబు, పాప ఉన్నారు.

అనుష్క శర్మ తన ఫిట్నెస్, క్రమశిక్షణ లైఫ్ స్టైల్ తో ఎప్పుడూ అట్రాక్షన్ అవుతుంటుంది. ఆమె తరచూ తన ఆహారపు అలవాట్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భోజనం, ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

గత ఆరు నెలలుగా తన బ్రేక్ ఫాస్ట్ కేవలం ఇడ్లీ సాంబార్ అని తెలిపింది. తన ఆహారపు అలవాట్లతోనే ఫిట్నెస్, వెయిట్ నియంత్రణ ఆధారపడి ఉందంటోంది. ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ ర్యాన్ ఫెర్నాండో అనుష్క ఫుడ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఆమె మోనోట్రోపిక్ డైట్ లేదా మోనో డైట్ను అనుసరిస్తుందని వివరించారు. ఒక వ్యక్తి ఒకే భోజనంలో ఒక ఆహార పదార్థం లేదా ఒక రకమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పండ్లు, పప్పు, బియ్యం, ఇడ్లీ సాంబార్ మాత్రమే తీసుకుంటారట.

ఈ పద్దతి జీర్ణ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని అన్నారు. ఒకేసారి ఒకే రకమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఇది ఆమ్లత్వం, ఉబ్బరం లేదా అజీర్ణం వంటి తక్కువ సమస్యలకు దారితీస్తుందని తెలిపారు.