
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా 'మా' భవన నిర్మాణమే అజెండాగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం రంగంలోకి దిగారు.

సినిమా బిడ్డల ప్యానల్ పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన ప్రకాశ్రాజ్ అండ్ టీమ్కి నిర్మాత బండ్ల గణేశ్ మద్దతు ప్రకటించిన విషయం విదితమే. కాగా, తాజాగా 'మా' ఎన్నికలు, శాశ్వత భవన నిర్మాణం గురించి బండ్ల గణేశ్ కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ‘మా’కు శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం లేదన్నారు. 'మా' బిల్డింగ్కు తాను వ్యతిరేకినని... ఇప్పుడు అది కట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు బండ్ల. అసోసియేషన్లో సుమారు 900 మంది సభ్యులున్నారు. వారిలో దాదాపు 150 మంది వరకూ దారిద్యరేఖకు దిగువన ఉన్నారని చెప్పారు.

ఆర్థిక స్థోమత లేక ప్రతి నెలా చిన్న కళాకారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండ్ల గణేశ్ పేర్కొన్నారు. తన ఉద్దేశం ప్రకారం.. బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి, ఉచితంగా ఇస్తే ఆ కిక్కే వేరే లెవల్లో ఉంటుందని చెప్పారు.

'మా'కు బిల్డింగ్ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు. సినిమా షూటింగ్స్ నిలిచిపోవు. సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోరు.. కానీ పేద కళాకారులకు నివాసాలు ఇస్తే.. వారు జీవితాంతం తృప్తిగా బ్రతుకుతారని బండ్ల గణేశ్ అభిప్రాయపడ్డారు.