హీరోల మార్కెట్తో పనిలేకుండా బడ్జెట్ పెట్టినపుడు వర్కవుట్ అయితే.. ఒక్కోసారి మగధీర, బాహుబలి వస్తుంటాయి.. మరికొన్నిసార్లు ఏజెంట్, లైగర్లు కూడా వస్తుంటాయి. కంటెంట్ కనెక్ట్ అయితే ఓకే కానీ లేదంటే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి.
ఈ లెక్చర్ అంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? తాజాగా ఓ సినిమాకు కూడా ఊహకు మించిన బడ్జెట్ పెడుతున్నారు. ఇంతకీ ఏంటా సినిమా..? ఈ మధ్య హీరోల మార్కెట్ను పట్టించుకోకుండా బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు.
అదేంటని అడిగితే తమ లెక్కలు తమకున్నాయి అంటున్నారు. పాన్ ఇండియా కారణంగా నాన్ థియెట్రికల్ నుంచే చాలా సినిమాలు సేఫ్ అవుతున్నాయి. దాంతో బడ్జెట్ దగ్గర నో కాంప్రమైజ్ అంటున్నారు మేకర్స్.
తాజాగా చందూ మొండేటి, నాగ చైతన్య తండేల్ కోసం భారీ ప్రయోగమే చేయబోతున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతూకు సక్సెస్ లేదు. బంగార్రాజు హిట్టైనా అందులో నాగార్జున ఉన్నారు. సోలో హీరోగా నటించిన థ్యాంక్యూ, కస్టడీ దారుణంగా బోల్తా కొట్టాయి.
మధ్యలో దూత వెబ్ సిరీస్ సక్సెస్ అయినా.. అది థియెట్రికల్ కాదు. దాంతో చై మార్కెట్ బాగా పడిపోయింది. ఈ ట్రాక్ రికార్డ్తో పనిలేకుండా తండేల్ తెరకెక్కుతుంది. సాయి పల్లవి ఇందులో హీరోయిన్.
చైతూ మార్కెట్ 40 కోట్ల లోపే ఉన్నా.. తండేల్ బడ్జెట్ మాత్రం 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆమదాలవలస, గుజరాత్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేసారు మేకర్స్.
కార్తికేయ2తో చందూ మొండేటికి పాన్ ఇండియా డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ లెక్కలు చైతూ సినిమాకు వర్కవుట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. అందుకే రిస్క్ అని తెలిసినా.. నో కాంప్రమైజ్ అంటున్నారు బన్నీ వాస్.