
సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రజా సేవా నిబద్ధతపై విస్తృతమైన వివరాలను వెల్లడించారు. ‘రాపిడ్ ఫైర్’ సెషన్లో ఆమె పలువురు సినీ ప్రముఖులపై తన ఆలోచనలను పంచుకున్నారు. సావిత్రిని తనకిష్టమైన నటిగా, ‘మహానటి’గా అభివర్ణించారు. జయసుధని చిన్నపిల్లల మనస్తత్వం, సహజమైన నటనకు ప్రతీకగా పేర్కొన్నారు. జయప్రద అందమైన మొహం, మంచి మనసున్న వ్యక్తి అని, శ్రీదేవిని ఒక అందమైన బొమ్మతో పోల్చారు విజయశాంతి.

నటి రాధిక గురించి మాట్లాడుతూ, ఆమె ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తుందని అన్నారు. తాను కలిసి పనిచేసిన ప్రముఖ నటుల గురించి వివరిస్తూ, చిరంజీవితో ఎక్కువగా అంటే ఇరవై చిత్రాలలో నటించానని తెలిపారు. చిరంజీవి మంచి డాన్సర్ అని, హాస్యాన్ని చక్కగా పండిస్తారని, అందరితో కలివిడిగా ఉంటారని ప్రశంసించారు. నాగార్జున, వెంకటేష్లతో తక్కువ సినిమాలు చేసినప్పటికీ, వారిని మంచి నటులుగా అభిప్రాయపడ్డారు.

బాలకృష్ణతో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఆయన సెట్స్లో సరదాగా ఉండే మనిషి అని, తనకు సోదరుడితో సమానమని అన్నారు. ‘భానుమతి గారి మొగుడు’ సినిమా షూటింగ్ సమయంలో రాఖీ పండుగ రావడంతో బాలకృష్ణకు రాఖీ కట్టి, ఆ బంధాన్ని పదిలపరుచుకున్నానని తెలిపారు. ఇప్పుడు కూడా ఏ విషయమైనా బాలకృష్ణ తనతో పంచుకుంటారని, ఆయన్ని ఒక అన్నగా భావిస్తానని స్పష్టం చేశారు.

దివంగత సూపర్స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ, ఆయన బోళా మనిషి అని, నిజమైన మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు. తెలుగు సినిమా రంగంలో తనను తొలిసారిగా పరిచయం చేసింది కృష్ణ గారేనని, ఆయనకు, విజయనిర్మల గారికి తాను చాలా గౌరవం ఇస్తానని, వారిని తాను మిస్ అవుతున్నానని తెలిపారు విజయశాంతి. కృష్ణ కుమారుడు మహేష్ బాబును కూడా చక్కటి బిడ్డగా పేర్కొన్నారు. మహేష్ బాబుతో చేసిన సినిమా ద్వారానే తాను రీ-ఎంట్రీ చేశానని, అందుకు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు.

తన వ్యక్తిగత జీవితం, ప్రజా సేవా నిబద్ధత గురించి ప్రస్తావిస్తూ, తాను పెద్ద ఆశలు లేని సాధారణ మనిషినని విజయశాంతి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తిగా, ప్రజలు బాగుండాలని కోరుకునే మనిషినని ఆమె వివరించారు. తాను బ్రతికి ఉన్నంతవరకు ప్రజల కోసం పని చేస్తానని, ప్రజల సంతోషమే తన సంతోషమని తెలిపారు. తనకి పెద్దగా కోరికలేమీ లేవని, తన జీవితాన్ని దాదాపుగా తెలంగాణ ప్రజల సేవకే అంకితం చేశానని ఆమె ప్రకటించారు.