
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ సహజ నటనతో, ఆకట్టుకునే రూపంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. ఇటీవలే హిట్ 3 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాని ప్రస్తుతం ప్యారడైజ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరనే విషయాన్ని బయటపెట్టారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్న నాని.. ఓ వైపు నటుడిగా, మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. తనకు అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి అంటే ప్రాణమని, ఆమెను తాను ఎంతగానో ఆరాధిస్తానని తెలిపారు. నాని మాట్లాడుతూ.. "నాకు శ్రీదేవి గారంటే చాలా ఇష్టం, నిజం చెప్పాలంటే ఆమెపై నాకు పిచ్చి. శ్రీదేవి, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన 'క్షణక్షణం' సినిమాను నేను ఎన్ని సార్లు చూశానో నాకే లెక్కలేదు. లక్ష సార్లు చూసినా సరే, మళ్లీ మళ్లీ చూడాలనిపించే అద్భుతమైన చిత్రం అది" అని అన్నారు.

"అసలు శ్రీదేవి అంత అందంగా ఎలా ఉన్నారో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఆ సినిమాకు శ్రీదేవి అందమే ఒక ప్రత్యేకమైన ఆకర్షణను, కొత్తదనాన్ని తీసుకొచ్చింది" అంటూ నాని తన మనసులోని మాటలు బయటపెట్టారు. నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రం 'ది పారడైజ్' (The Paradise) లో నటిస్తున్నారు. బ్లాక్బస్టర్ హిట్ 'దసరా' తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది కావడంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

సికింద్రాబాద్ బ్యాక్డ్రాప్లో సాగే ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా. ఒక మురికివాడ (స్లమ్) నేపథ్యంలో, వ్యవస్థపై తిరగబడే ఒక అణగారిన వర్గం కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడని అత్యంత రగ్గడ్ , ఇంటెన్సి్ లుక్లో కనిపించనున్నారు. పొడవాటి జడలు, ముక్కుపుడకతో నాని మేకోవర్ ఇప్పటికే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పటికే విడుదలైన 'ఆయా షేర్' (Aaya Sher) సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన కాయాడు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, కీలక పాత్రల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయాల్ నటిస్తున్నారు. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి రీషూట్లు లేకుండా, అనుకున్న ప్లాన్ ప్రకారమే సాగుతోందని మేకర్స్ స్పష్టం చేశారు. నాని కెరీర్లోనే ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.