
ప్రస్తుతం బంగారం రేట్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.1.43 లక్షలుగా ఉంది. శనివారం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,780గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,800గా ఉంది.

అయితే బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్న క్రమంలో ఎక్స్లో ఓ నెటిజన్ పోస్ట్ తెగ వైరల్గా మారింది. కేజీ బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయవచ్చంటూ ఓ ఎక్స్ యూజర్ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. ఆ పోస్ట్ ఏంటంటే..?

1990లో కేజీ బంగారం ధర మారుతీ 800 కారు ధరకు సమానంగా ఉండేదని, 2000 నాటికి మారుతి ఎస్టీమ్ ధరకు సమానంగా పెరిగిందని ట్వీట్ చేశాడు. ఇక 2005 నాటికి కేజీ గోల్డ్ రేటు ఇన్నోవా కారు వాల్యూకి సమానంగా చేరుకోగా.. 2010 నాటికి ఫార్చ్యూనర్కు సమానంగా ఉందన్నాడు.

ఇక 2019లో కేజీ బంగారంతో బీఎండబ్ల్యూ ఎక్స్ 1, 2025లో డిఫెండర్ కొనుగోలు చేసే అవకాశం వచ్చిందన్నాడు. ఇక 2030 నాటికి కేజీ బంగారంతో రోల్స్ రాయిస్ కొనుగోలు చేయవచ్చని, ఇక 2040 నాటికి ప్రైవేట్ జెట్ను కూడా కొనుగోలు చేయవచ్చని తన ట్వీట్లో పేర్కొన్నాడు.

ప్రస్తుతం ధర ప్రకారం కేజీ బంగారం రూ.1,43,78,000గా ఉంది. ప్రస్తుతం ఈ ధరతో మనం ఓ మంచి లగ్జరీ కారును కొనుగోలు చేయవచ్చు. ధర ఇలాగే పెరిగే అవకాశం ఉన్నందున భవిష్యత్తుల్లో కేజీ బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయవచ్చనే అతడి అభిప్రాయంతో అందరూ ఏకీభవిస్తున్నారు.